నీ భర్తను చంపి నిన్ను నా దానిని చేసుకుంటా..

2 Jan, 2019 10:23 IST|Sakshi

వేటపాలెం: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశాయిపేట హరిజనవాడ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ వెంకటకృష్ణయ్య కథనం ప్రకారం.. దేశాయిపేట ఐటీఐ కాలనీకి చెందిన ఎర్రా నరేంద్రబాబు కొన్ని చేనేత మగ్గాలు నేయిస్తుంటాడు. అదేక్రమంలో నీలకంఠపురానికి చెందిన గుత్తి అశోక్‌రాజుకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టి మగ్గం పని చేయిస్తున్నాడు. ఈ క్రమంలో తరుచూ అశోక్‌ ఇంటికి నరేంద్ర వస్తుండేవాడు.

 ఇలా వస్తుండటంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నరేంద్రపై అశోక్‌రాజు అనుమానం పెంచుకున్నాడు. దేశాయిపేట హరిజనవాడ సమీపంలో కాపుకాచి మోటార్‌ సైకిల్‌పై వస్తున్న నరేంద్రను చంపాలనే ఉద్దేశంతో ఇష్టారీతిన అశోక్‌రాజు దాడి చేశాడు. కాలికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడు నరేంద్రను చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. వైద్యశాలలో చీరాల రూరల్‌ పోలీసులు క్షతగాత్రుడి నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా గుత్తి అశోక్‌రాజు భార్య ప్రసన్నలక్ష్మి కూడా పోలీసులకు కౌంటర్‌ ఫిర్యాదు చేసింది.

 తనకు  నరేంద్ర మగ్గం పనులు ఇస్తూ లొంగదీసుకుని ఆరు నెలలుగా శారీరకంగా వాడుకున్నాడని, నీ భర్తను చంపి నిన్ను నా దానిని చేసుకుంటానని బెదిరించాడని, చెప్పినట్లు వినకుంటే నలుగురికి చెప్పి పరువు తీస్తానని బెదిరించాడని, ఈ విషయం తన భర్తకు తెలిసి నెల క్రితం అతడిని మందలించాడని, పది రోజుల క్రితం ఇంటికి వచ్చి బలవంతం చేయబోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌంటర్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు