సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 309వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం పాలకొండ శివారు నుంచి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్, నాగావళి బ్రిడ్జ్ మీదుగా బొడ్డవలస క్రాస్, సంకిలి, చిన్నయ్యపేట, మజ్జిరాముడు పేట మీదుగా ఉంగరాడమెట్ట వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.
వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.