ఆంధ్రప్రదేశ్ తెలుగు క్యాలెండర్లో కొత్త పండగ చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రైతు దినోత్సవం అయింది. ముక్కారు పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న సింహపురిలో వైఎస్సార్ హయాం సాగునీటి శకంగా మారింది. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావించాలంటే క్రీ.పూర్వం.. క్రీ.శకం అన్నట్లుగా దశాబ్దం ముందు వైఎస్సార్, దశాబ్దం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ఈ రోజు పల్లెకు ఆ పండగొచ్చింది. వైఎస్సార్ కేవలం ఐదేళ్ల తన పాలనలో వందేళ్ల అవసరాలు తీర్చేలా సాగునీటి రంగం అభివృద్ధికి పునాదులు వేశారు. ఆయన హయాంలోనే కొన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. మరి కొన్ని పురుడు పోసుకున్నాయి.
జిల్లాలో చారిత్రాత్మకంగా చెప్పుకో దగిన ప్రాజెక్ట్ల్లో 78 టీఎంసీ సామర్థ్యం కలిగిన సోమశిల ఒకటి. దాదాపు మూడు దశాబ్దాలుగా 35 టీఎంసీల సామర్థ్యం దాటని ప్రాజెక్ట్ను రెండేళ్లలో పూర్తి సామర్థ్యానికి పూర్తి చేసిన ఘనత వైఎస్సార్కే దక్కింది. దివంగత నేదురుమల్లి జనార్దన్రెడ్డి స్వగ్రామం వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ రెండోది. సీఎంగా ఉండి నేదురుమల్లినే పూర్తి చేయలేకపోయిన స్వర్ణముఖిని వైఎస్సార్ రెండేళ్లలోనే పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. చారిత్రాత్మకమైన నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు శ్రీకారం చుట్టితే.. దశాబ్ద కాలంగా పురోగతికి నోచుకోలేదు. వీటిని ఈ ఏడాది ఆఖరులోగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే తెలుగుగంగ, ఎస్ఎస్ కెనాల్తో పాటు ప్రధాన పట్టణాల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.
సాక్షి, నెల్లూరు: అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలపురిగా మార్చిన అపర భగీరథుడు. దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు జలయజ్ఞం చేసిన పాలక కర్షకుడు. వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్లకు పునాదులు వేసి, పూర్తి చేసిన జలయాజి్ఞకుడు.. రాజశేఖరుడిని దశాబ్దం తర్వాత కూడా జిల్లా రైతాంగం స్మరిస్తోంది.
సంగం బ్యారేజీ..
పెన్నా బ్యారేజ్..
35 ఏళ్ల కల.. మూడేళ్లలో సాకారం
వాకాడు: స్వర్ణముఖి నదిపై బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలనే 50 ఏళ్ల డిమాండ్.. 35 ఏళ్ల కలను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు అంకితమిచ్చారు. పాతిక వేల ఎకరాల వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. నదీ పరివాహక ప్రాంతమైనా సాగునీటి కొరత కారణంగా కరువు తాండవం చేసేది.
కరువు నేలపై జలసిరులు
వెంకటగిరి: కరువు నేలపై జల సిరులు పారించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. కరువుతో అల్లాడే నియోజకవర్గ రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎస్ఎస్ కెనాల్, తెలుగుగంగ బ్రాంచ్ కాలువలు వంటి భారీ ప్రాజెక్ట్లకు పునాదులు పడ్డాయి.
గూడూరు దాహార్తికి.. శాశ్వత విముక్తి
గూడూరు: గూడూరు దాహార్తికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శాశ్వత విముక్తి కల్పించారు. గూడూరు పట్టణ ప్రజలకు ఎండాకాలం వచ్చిందంటే గొంతెండేది. పట్టణానికి తాగునీరందించేందుకు విందూరు, వేములపాళెం గ్రామాల వద్ద ఉన్న వాటర్ వర్క్స్ నుంచి తాగునీరు సరఫరా అయ్యేది. ఎండాకాలంలో తాగునీటి వనరులైన బోర్లు ఒట్టిపోయి పట్టణ ప్రజలు తాగునీటికి అల్లాడే పరిస్థితి. ఈ క్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఇప్పటి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి గూడూరు పట్టణ ప్రజలు తాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారని, వారి దాహార్తిని శాశ్వతంగా తీర్చాలంటూ వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన 2008లో కండలేరు నుంచి గూడూరుకు పైప్లైన్ల ద్వారా తీర్చేందుకు రూ.64.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో 2009 కండలేరు నుంచి గూడూరుకు తాగునీటిని తీసుకొస్తున్నారు. వేములపాళెం వద్ద, రిజర్వాయర్ ఏర్పాటు చేయడంతో పాటు, శుద్ధి చేసే పరికరాలను, కండలేరు నుంచి పైప్లైను ఏర్పాటు పనులు జరిగి పట్టణ ప్రజల శాశ్వత దాహార్తి తీరింది.
పల్లెబాట వరం.. ఎస్ఎస్ ట్యాంక్
సూళ్లూరుపేట: దశాబ్దాల సూళ్లూరుపేట దాహార్తిని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కమాటతో శతాబ్దానికి సరిపడా తీర్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాలో సూళ్లూరుపేటలో ప్రారంభించిన పల్లెబాటలో స్థానిక నేతలు అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. వందేళ్లలో పెరిగే పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటికి ఇబ్బందులు రాకుండా కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో సమ్మర్ స్టోరేజీని నిర్మించారు. సమ్మర్ స్టోరేజీని నింపుకోవడానికి తెలుగుగంగ ఏడో నంబర్ బ్రాంచ్ కాలువ నుంచి 14 ఆర్ కాలువ ద్వారా నీటిని అందించాలనేది వైఎస్సార్ ప్లాన్. ఆ ప్లాన్లో గడిచిన ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. 2012–13లో రూ.117 కోట్లతో నీటి పథకాలు, మరో రూ. 75 కోట్లతో ఇంకో ఎస్ఎస్ ట్యాంక్ మంజూరు చేస్తానని హామీ ప్రతిపాదనలకే పరిమితమైంది. టీడీపీ హయాంలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు ప్రతిపాదన మరుగున పడింది. ప్రస్తుతం వైఎస్సార్ ఇచ్చిన సమ్మర్ స్టోరేజీ మాత్రం పట్టణవాసులు గొంతు తడుపుతోంది.
అపర భగీరథుడు
సైదాపురం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో గంగ జలాలను సైదాపురానికి తీసుకువచ్చిన అపర భగీరథుడు. మెట్టప్రాంతానికి కండలేరు జలాలను తెప్పించి తద్వారా బీడు భూములను మాగాణి భూములుగా మార్చారు. సుమారు 23 వేల ఎకరాల భూములు నేడు నిత్యం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలయజ్ఞం ద్వారా గంగ బ్రాంచ్ కాలువలను నిర్మాణానికి నిధులను పుష్కలంగా విడుదల చేశారు. కండలేరు నుంచి 2ఏ బ్రాంచ్ కాలువ నిర్మాణానికి నిధులను విడుదల చేశారు. 2ఏ నిర్మాణ ద్వారా ఈ ప్రాంతంలోకి గంగ నీరు వచ్చి చేరుతుండటంతో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. సుమారు 15 వేల ఎకరాలు సాగవుతోంది. గతంలో వర్షాధారంగా ఆధారపడి ఉన్న రైతులకు 2ఏ బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రతి చెరువుకు సాగు నీరు అందించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. అలాగే 2 బీ కెనాల్ ద్వారా మరో 7 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.
సమగ్ర సోమశిల
సాక్షి, నెల్లూరు: సింహపురి సిగలో జలనిధి ఉన్నా.. వ్యవసాయానికి సాగునీటి కరువు వెంటాడేది. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్న సోమశిల ప్రాజెక్ట్కు సంబంధించి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండేళ్లలోనే ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని సంకలి్పంచారు. వైఎస్సా ర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులను పూర్తి చేసి 2007 నాటికి 72 టీఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు అంకితమిచ్చి చెరగని ముద్ర వేసుకున్నారు.
మూడు దశాబ్దాల తర్వాత..
పెన్నానదికి ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండి వృథాగా సముద్రంలో కలుస్తుంటే కరువు ప్రాంతాల గొంతు తడపాలన్న ప్రయత్నమే జిల్లాలోని సోమశిల జలాశయానికి పునాది పడింది.
జగన్ హయాంలో కల సాకారం
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సమగ్ర సోమశిల ముఖచిత్రం మారింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న అటవీ భూములకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటేందుకు రూ.450 కోట్లు ఆ శాఖకు కేటాయించారు. ఇప్పటి వరకు సోమశిలకు భారీ వరదలు వచ్చినా కేవలం 73 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచేవారు. మిగిలిన 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు లభించలేదు. కొత్త ప్రభుత్వం రాకతో అటవీ భూములకు పరిహారం కొలిక్కి రావడంతో 78 టీఎంసీల నీరునిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది కురిసిన వర్షాలకు 78 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది.