స్పీకర్‌పై ‘అవిశ్వాసా’నికీ వెనుకాడం

27 Aug, 2014 01:03 IST|Sakshi
స్పీకర్‌పై ‘అవిశ్వాసా’నికీ వెనుకాడం

ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ 
అధికారపక్షానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడి హితవు

 
ప్రజల వాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు
ఇలాగే కొనసాగితే సభాపతిపై  అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధం
ఇద్దరు ప్రతిపక్ష సభ్యుల  సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి
మరో సభ్యుడిపై హక్కుల నోటీసునూ ఉపసంహరించాలి
నా ప్రసంగానికి 106 నిమిషాలు అంతరాయం కలిగించా
రు
 
 హైదరాబాద్: శాసనసభలో ప్రజావాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్న తీరు ఇలాగే కొనసాగితే సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా తాము వెనుకాడబోమని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు జరిగి ఉండవేమోనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే..  స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికీ వెనుకడుగువేయబోమన్నారు. మంగళవారం శాసనసభ వాయి దాపడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో సహచర ఎమ్మెల్యేలతో కలసి జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకూ పరిస్థితిని రానివ్వకూడదన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసిన తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కోరారు. మరో సభ్యునిపై ప్రతిపాదించిన సభా హక్కుల నోటీసును కూడా వెనక్కి తీసుకోవాలన్నారు.

మాట్లాడుతోంటే మైక్ కట్ చేస్తున్నారు...

ప్రతిపక్ష నాయకుడు ఒక అంశంపై తాను నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేయాలనుకుంటున్నానని, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా సభాపతి మైక్ ఇవ్వని పరిస్థితి ఉం దని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా సభలో నుంచి వెళ్లిపోండి అనే తీరు బహుశా ఎపుడూ లేదేమోనన్నారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని.. బడ్జెట్‌పై తన ప్రసంగం పూర్తికాక ముందే మైక్‌ను కట్ చేశారని ఆయన చెప్పారు. ‘‘సోమవారం నేను 11.08 గంటలకు ప్రసంగం మొదలు పెట్టాను. ప్రజల సమస్యల మీద, బడ్జెట్‌లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల మీద మాట్లాడాను. చంద్రబాబు, అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల ఆధారంగా వారు వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపైనే మాట్లాడాను. ఒక్కదానిపై కూడా నేను డీవియేట్ కాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించలేదు. పూర్తిగా సబ్జెక్ట్ మీదే మాట్లాడాను. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో వాటికి ఎన్ని కేటాయింపులు చేసిందనే అంశాలు తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. కానీ నా ప్రసంగానికి 17 సార్లు అంతరాయం కలిగించారు. అధికారపక్ష సభ్యు లు అడ్డుతగిలి గంటా ఆరు నిమిషాలపాటు అం తరాయం కలిగించారు. మా పార్టీ నేతలు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీవీలో చూసి స్పష్టంగా అంతరాయాలు ఎన్నిసార్లు, ఎపుడెపుడు జరిగాయని సమయంతో సహా నమోదు చేశారు. 11.08గంటలకు నేను ప్రసంగం ప్రారం భిస్తే ఈ అంతరాయాలు కలుపుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు మైక్‌ను కట్ చేశారు. ఈ రెండున్నర గంటల సమయంలో అంతరాయా లు కలిగిస్తూనేపోయారు. రెండు మూడు నిమిషాలు మాట్లాడితే చాలు మైక్ కట్ చేయడం.. అధికారపక్షానికి అవకాశం ఇవ్వడం, మరో నా లుగు నిమిషాలు మాట్లాడాక మళ్లీ మైక్ కట్.. మరో పది నిమిషాలు మాట్లాడిన తరువాత మళ్లీ మైక్ కట్.. బహుశా ఇంతటి అన్యాయమైన పరి స్థితులు ఎవరికీ ఎదురై ఉండవేమో!’’ అని జగన్ ఆశ్యర్యం వ్యక్తంచేశారు.

నిబంధనల ప్రకారమే చేస్తున్నారా?

జగన్ ఈసందర్భంగా అసెంబ్లీ రూల్స్ బుక్‌లోని పలు నిబంధనలను మీడియా ప్రతినిధులకు చదివి వినిపించారు. ‘‘151వ నిబంధనలోని 3వ సబ్ సెక్షన్‌లో బడ్జెట్‌కు సంబంధించి ఆరు రోజు లపాటు సాధారణ చర్చ జరగాలని కచ్చితంగా నిర్దేశించారు. అలాగే వివిధ డిమాండ్లపై చర్చ, ఆమోదానికి ఎనిమిది రోజుల సమయం కేటాయించాలని ఉంది. ఇవి కచ్చితంగా అనివార్యం గా పాటించి తీరాల్సిన నిబంధనలు. అలా జరగాల్సిన సాధారణ చర్చను కేవలం నాలుగు రో జులకు కుదించారు. శాసనసభలో ఉన్నది రెండే రెండు పక్షాలు.. ప్రతిపక్షంలో ఉన్నది మా పార్టీ ఒక్కటే అయినా గంటన్నర సమయమే ఇస్తారని చెప్తున్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో నేను మాట్లాడటానికి మరో 20 నిమిషాల సమయం కావాలని అడిగితే.. అదీ ఇవ్వలేదు.. నాకు ఇవ్వకపోగా అధికారపక్షానికి మైక్ ఇచ్చి మాట్లాడమనడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని వివరించారు.

విపక్షం గొంతు నొక్కితే ప్రజలు హర్షించరు

శాసనసభలో ఉన్నది అధికార, ప్రతిపక్షాలేనని.. ప్రతిపక్షమన్నది ప్రజల గొంతు కనుక వాళ్ల గొంతు ప్రజలు వినాలనుకుంటారని.. ప్రతిపక్షం గొంతు వినపడేలా అవకాశం కల్పించడం స్పీకర్ ధర్మమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం గొం తు పూర్తిగా నొక్కేయాలి, వినపడకూడదనే ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు హర్షించరని అన్నారు. వాస్తవానికి నిజమైన ప్రతిపక్షం తాము కాదని, ప్రజలే నిజమైన ప్రతి పక్షమని అందుకే ప్రజల తరఫున తాము మాట్లాడేటపుడు గొంతును వినడానికి అధికారపక్షానికి ఓపిక ఉండాలని, ఆ ప్ర కారం అందరూ మార్పు తెచ్చుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసంహరించడంతో పాటుగా తమ గొంతు వి నే ఓపిక తెచ్చుకుని సభ నడిపితే మంచిదన్నారు.


ఆత్మస్తుతి-పరనింద తప్ప ఇంకేమీ ఉండదు

సభలో ప్రతిపక్షం గొంతు నొక్కితే ‘ఆత్మస్తుతి-పరనింద’ తప్ప ఇంకేమీ మిగలదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘సభ ఉండేది మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడానికి.. వైఎస్‌ను విమర్శించడానికే అనుకుంటే ఇంకేమీ మిగలదు’’ అని అధికారపక్షానికి హితవుపలికారు. తమవైపు నుంచి చర్చ బాగా జరగాలనే ఉద్దేశంతోనే పలు అంశాలపై నిరసన తెలుపుతూ సభలో కూర్చుంటున్నామని, మైక్ కట్ చేసినా బాధను దిగమింగుకుని తమవైపు నుంచి నాలుగడుగులు ముందుకేసి సహకరిస్తున్నామన్నారు.
 
ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావట్లేదు..

 
శాసనసభ జరుగుతున్న తీరును జగన్ తీవ్రం గా తప్పుబట్టారు. ‘‘అధికారపక్షం వారికి మైక్ ఇస్తూ చంద్రబాబును గొప్పగా పొగిడించుకోవడం, దివంగత రాజశేఖరరెడ్డిని తిట్టించడం మాత్రమే జరుగుతోంది. అసలు ముఖ్యమంత్రి వైఎస్సా లేక చంద్రబాబునాయుడా? అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. వైఎస్ చనిపోయి కూడా ఐదేళ్లు దాటింది. అయినా ఇంకా ఆయననే తిట్టడం ఎంత దారుణం? మా పార్టీ సభ్యులు టీడీపీ విధానాలపై విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే చాలు.. వెంటనే మైక్ కట్ చేస్తున్నారు.. టీవీల్లో ప్రసారాలను గమనించే వారికి ఇది స్పష్టంగా కనబడుతోంది. టీవీ ఫోకస్ కూడా ఎక్కువగా అధికారపక్ష సభ్యుల మీదనే ఉంటోంది. మా వాళ్లు (వైఎస్సార్ సీపీ సభ్యులు) బాగా మాట్లాడుతుంటే టీవీల్లో చూపించరు. అదే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టేది అదే పనిగా చూపిస్తారు. అందుకు కారణమేమంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించే హక్కులు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వాళ్లకు ఇచ్చారు. ఇక టీవీల్లో కూడా వాళ్లు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. చెప్పాలనుకున్నదే చెప్తున్నారు. ప్రతి పక్షం గొంతు అనేది ఎక్కడా వినిపించకూడదు, కనిపించకూడదు అన్నట్లు చేస్తోంటే ఇక ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా?’’ అ ని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇవ్వాల్సిన మంత్రులు మాట్లాడుతున్నప్పుడు అదే పని గా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని నిందించడం అం దరూ గమనిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. అవి కూడా తప్పుడు తిట్లేనని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. తాము మళ్లీ వాటిపై వివరణలు అడుగుదామంటే మైక్ ఇవ్వరని చెప్పా రు. అన్యాయం జరుగుతోందని తాము నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా టీవీల్లో కనిపించదన్నారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తూ శాసనసభను నడుపుతున్నారంటే నిజంగా రాష్ట్రం మొత్తం సిగ్గుతో తలొం చుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
 
సత్సంప్రదాయాలను నెలకొల్పుదాం...

‘‘శాసనసభలో ఇలాంటి దుస్సంప్రదాయాలను నెలకొల్పవద్దు.. అధికారంలో ఇవాళ మీరుండొచ్చు... రేప్పొద్దున మేము రావొచ్చు. ఇలాంటి సంస్కృతి పునరావృతమైతే భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మా పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.. మరో సభ్యునిపై సభాహక్కుల తీర్మానాన్ని ఇచ్చారు.. అసలు వీరెందుకు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు? అలా నిరసనలు తెలపకుండా వారిని పిలిచి మాట్లా డి సమయం కేటాయించాలన్న ఆలోచన ఎందుకు చేయరు?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకు న్న బలం మేరకు సభా కార్యక్రమాల సమయంలో 40 శాతం తమ పార్టీకి కేటాయిం చాలనీ, అంత సమయం ఇస్తున్నారా అన్న ది ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచిం చారు. అసెంబ్లీ నడిపే తీరు కూడా దిగజారిపోయింద ని ఆందోళన వ్యక్తంచేశారు.
 
ఇచ్చిన సమయంపైనా అబద్ధం చెప్తున్నారు


తమ పార్టీకి గంటన్నర సమయం కేటాయి స్తూ బీఏసీలో చెప్పినప్పుడు జ్యోతుల నెహ్రూ, అమర్‌నాథ్‌రెడ్డి అంగీకరించారన డం అబద్ధమేనని జగన్ స్పష్టంచేశారు. ‘మీరు చెప్తున్నది తప్పు సార్’ అంటూ సభలోనే స్పీకర్‌తో అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారని, జ్యోతుల నెహ్రూ తనకు మైక్ ఇవ్వకపోయి నా గట్టిగా అరుస్తూ ‘అబద్ధం’ అని చెప్పార ని, స్పీకర్ స్వయంగా ఒకసారి తనకు 2.30 గంటలు కేటాయించినట్లు, మరోసారి 1.30 గంటలు కేటాయించినట్లు చెప్పారని గుర్తుచేశారు. తన ప్రసంగానికి 21 నిమిషా లే అంతరాయం కలిగించారని స్పీకర్ చెప్ప డం సరికాదన్నారు. ‘‘అందరూ టీవీలు చూశారు కదా అంతరాయం కలిగించింది అంతేనా? ఏమిటీ అన్యాయం? నా ప్రసంగాన్ని 52 నిమిషాల సేపు అడ్డుకున్నారని జాబితాను స్పీకర్‌కూ ఇచ్చాం. ఆ తర్వాత కూడా ఇంకా అంతరాయాలు జరిగాయి. నేను మాట్లాడుతున్నప్పుడు 1.06 గంటల పాటు అడ్డుకున్నారు.. ఇంతకంటే దారుణమేమైనా ఉందా?’’ అని ప్రశ్నించారు.
 
 
 

మరిన్ని వార్తలు