మంగళగిరి: దళితులను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి.. ఆదినారాయణ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆదినారాయణ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మరెవ్వరూ అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేకుండా ఆదినారాయణ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మంత్రి స్ధాయిలో ఉన్న ఆది నారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలోని దళితులందరినీ కించపరిచినట్లే అని అన్నారు.