భగవంతుడు టీడీపీ నేతలకు సిగ్గు పెట్టలా...

2 Jun, 2015 03:59 IST|Sakshi
భగవంతుడు టీడీపీ నేతలకు సిగ్గు పెట్టలా...

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి, ఎమ్మెల్యే ఆర్కే

 పట్నంబజారు(గుంటూరు) :  భగవంతుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గుఎగ్గు పెట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బందిపోట్లుగా మారి ప్రభుత్వ వనరులను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను పక్కన పెట్టి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సమరదీక్షను దొంగ దీక్ష అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో  మాట్లాడారు.  ఐదు హామీల విషయంలో టీడీపీ నేతలు జనంలోకి వచ్చి నిజం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. 

జగన్ అవినీతిపరుడని వ్యాఖ్యలు చేస్తున్న నేతలు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి విషయాన్ని సైతం పరిశీలించాలన్నారు. నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే డబ్బులు ఇవ్వాలని చెప్పడం సిగ్గుచే టన్నారు.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆర్కే మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలను రాక్షసులుగా, తెలంగాణ నేతలను గొర్రెలుగా అభివర్ణించిన చంద్రబాబు నైతిక విలువలు మరచి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులో చంద్రబాబును ఏ 2గా పెట్టాలని డిమాండ్ చేశారు.   సమావేశంలో పలు విభాగాల నేతలు గుదిబండి చిన వెంకటరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, కొత్తా చిన్నపరెడ్డి, మండేపూడి పురుషోత్తం, మొగిలి మధు, బండారు సాయిబాబు, శిఖా బెనర్జీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు