ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం : మంత్రి బాలినేని

29 Jul, 2019 10:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సయమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పాతపట్నం పరిధిలోని గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 

కాపులను చంద్రబాబు మోసం చేశారు
కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్‌ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా  అణచివేశారో అందరికీ తెలుసన్నారు. కాపులను ఏ విధంగా బీసీలలో చేరుస్తారని కేంద్రం అడిగిన ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన బాబు కాపులను కూడా అలాగే మోసం చేశారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు