వైవీయూ వెబ్‌సైట్ హ్యాక్..!

25 Aug, 2015 03:30 IST|Sakshi
వైవీయూ వెబ్‌సైట్ హ్యాక్..!

- సరిదిద్దిన వైవీయూ వెబ్ మేనేజర్లు
- సమాచారం భద్రం
వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ సోమవారం ఉదయం హ్యాకింగ్‌కు గురైంది. వైవీయూ అధికార వెబ్‌సైట్ ఉదయం నుంచి ఓపన్ చేస్తున్నా ఎస్‌పీ అట్ ది రేట్ ఆఫ్ ఆర్‌కే సీఓడీ త్రీ ఆర్ అన్న పేరు మాత్రమే కనిపిస్తూ వచ్చింది. కాగా ఈనెల 24వ తేదీ నుంచి వైవీయూ రీసెట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పలువురు అభ్యర్థులు వైవీయూ అధికార వెబ్‌సైట్‌ను పరిశీలించగా వారికి ఓపన్ కాకపోవడంతో అర్థంకాక తికమక పడ్డారు.

పాక్ కోబ్రా ఆర్మీ పేరుతో హ్యాకింగ్ అయినట్లు అందులోని పలు సందేశాలు తెలిపాయి. దీంతో వైవీయూకు సంబంధించిన విలువైన సమాచారం ఏదైనా తస్కరించారా అన్న విషయం తెలియలేదు. అయితే వెంటనే తేరుకున్న వైవీయూ అధికారులు బెంగ ళూరు వెబ్ మేనేజర్స్‌తో సంప్రదించి హ్యాకింగ్‌కు గురైన అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి తిరిగి యధావిధిగా పనిచేసేలా చేశారు. దీంతో మధ్యాహ్నం సమయానికి మళ్లీ వైవీయూ వెబ్‌సైట్ తిరిగి పనిచేయడం ప్రారంభించింది.
 
వైవీయూ సమాచారం భద్రంగా ఉంది..
యోగివేమన విశ్వవిద్యాలయం అధికార వెబ్‌సైట్‌పై హ్యాకర్స్ దాడి చేసిన విషయం వాస్తవమే. అయితే కొద్దిసేపు మాత్రమే వెబ్‌సైట్ పనిచేయలేదు. విశ్వవిద్యాలయ వెబ్ డిజైనింగ్ అధికారులు డాక్టర్ శంకర్, జయంత్‌కశ్యప్ బృందం వెబ్‌సైట్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. హ్యాకింగ్ వలన ఎలాంటి డేటా కానీ, సమాచారం కానీ కోల్పోలేదు. అంతా భద్రంగానే ఉంది.    
- ఆచార్య బి. జయపాల్‌గౌడ్, ప్రిన్సిపాల్, వైవీయూ

మరిన్ని వార్తలు