టెలికంలో భారీగా ఉద్యోగాల కోత

30 Oct, 2019 08:34 IST|Sakshi

ఏజీఆర్‌ వివాదంలో  సుప్రీం తీర్పు టెల్కోలపై భారం

కొత్త నియామకాలకు చెక్‌, ఉద్యోగులపై వేటు

రాబోయే మూడు నెలల్లో మరింత పెరిగే అవకాశం

రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో  సీఓఎస్‌ కమిటి

సాక్షి, ముంబై: సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశీయ టెలికం కంపెనీలకు భారీ షాక్‌ ఇచ్చింది. టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్‌ జియో రాకతో కుదేలైన ఈ రంగానికి ఏజీఆర్‌పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు తీర్పు అశనిపాతంలా తగిలింది.  టెలికాం (డాట్‌) విభాగానికి టెల్కోస్ రూ .92,641 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనన్న సుప్రీం తీర్పు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న టెల్కోల లాభదాయకతను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.  దీంతో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి ఉంటుంది.  అంతేకాదు  రానున్న కాలంలో  ఉద్యోగులను తీసివేసే శాతం మరింత పెరగవచ్చని మార్కెట్‌  వర్గాలు పేర్కొంటున్నాయి.  

సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) వివాదంలో  తాజా తీర్పు ప్రకారం టెలికం రంగం మొత్తం సుమారు రూ 1.3 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.  దీంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదనే నిర్ణయంతోపాటు, ఉన్న ఉద్యోగాల్లో కూడా కోతలకు మొగ్గు చూపుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో భారత టెలికాం రంగంలో సుమారు 40వేల ఉద్యోగాల కోతకు దారితీయనుంది. అంతేకాదు ఆపరేటర్లలో ఎవరైనా దివాలా కోసం దాఖలు చేస్తే మరింత పెరగవచ్చు అని సీఐఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్, సీఈఓ ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు. టెల్కోస్, టవర్స్ కంపెనీలు ,ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎఎస్‌పీ) లను కలిగి ఉన్న ఈ రంగంలో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి.  కొన్ని కంపెనీలు దివాలా తీసే  అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మధ్య నుండి సీనియర్ స్థాయి  ఉద్యోగులకు  ఉద్వాసన తప్పదని  ఆయన అన్నారు. అలాగే గత మూడేళ్ళలో, నియామకం గణనీయంగా తగ్గింది. సీనియర్ స్థాయిలో పదవులు భర్తీ  కావడంలేదనీ హెచ్‌ కన్సల్టెంట్ ఒకరు  చెప్పారు.

ప్రధానంగా  భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కానుంది.  డాట్‌ గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్‌ మొత్తంలో 23.4 శాతం (రూ. 21,682 కోట్లు) చెల్లించాల్సి ఉండగా, వొడాఫోన్ ఐడియా  30.55 శాతం (రూ. 28,308 కోట్లు)  చెల్లించాల్సింది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను నవంబర్ 14 వరకు వాయిదా వేయవలసి వచ్చింది. ఉదాహరణకు, జూన్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ 2,392.2 కోట్ల రూపాయల నికర నష్టాలను నమోదు చేసింది. వోడాఫోన్ ఐడియా త్రైమాసికంలో రూ .4,873.9 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 

కాగా 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో ఎంట్రీ తరువాత  రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్, టెలినార్ లాంటి ఇతర  సంస్థలు మూతతో ఈ రంగం పరిమాణం 30 శాతానికి పైగా తగ్గిపోయింది. అలాగే వొడాఫోన్‌, ఐడియా విలీనం తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించి, తగిన సలహాలిచ్చేందుకు కేంద్రం ఒక​ సెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో ఈ కమిటి  ఏర్పాటైన సంగతి తెలిసిందే.

 చదవండి  :  టెల్కోలకు భారీ ఊరట లభించనుందా?

>
మరిన్ని వార్తలు