మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్‌

16 Oct, 2019 19:37 IST|Sakshi

సాక్షి, ముంబై:   ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల  పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్‌ 22,  మంగళవారం  నిర్వహించనున్న ఈ సమ్మె కారణంగా తమ బ్యాంకింగ్‌కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. 

అక్టోబర్ 22న ట్రేడ్ యూనియన్ సంస్థలు ప్రతిపాదించిన సమ్మె కారణంగా బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే హెచ్చరించింది.  తమ శాఖల పనితీరు ప్రభావితం కావచ్చు లేదా స్తంభించిపోవచ్చు అని ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సంయుక్తంగా  అక్టోబర్ 22 న అఖిల భారత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) మద్దతు లభించిందని అసోసియేషన్‌ ప్రకటించింది. ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా ఏర్పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ విలీనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని విమర్శిస్తున్నాయి.

గత నెలలో కూడా నాలుగు బ్యాంక్ యూనియన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ)ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీవోసీ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (‍ఎన్‌వోబీవో) , ఇలాంటి సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చారు. తరువాత, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తమ డిమాండ్లను పరిశీలిస్తామని యూనియన్లకు హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 26-27  నిర్వహిచ తలపెట్టిన 48 గంటల సమ్మె వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు