ప్రిఫరెన్షియల్ ఇష్యూకే అధిక ప్రాధాన్యత
బ్యాలెన్స్ షీట్ పటిష్టతపై దృష్టి సారింపు
ఆర్థిక అనిశ్చితితో తొలి తైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న చిన్నతరహా బ్యాంకులు ఇప్పుడు తమ బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేసుకునేందుకు సిద్దమయ్యాయి. బ్యాలెన్స్ షీట్ పటిష్టత చర్యలో భాగంగా ప్రిఫరెన్షియల్ పద్దతిలో షేర్ల అమ్మకా ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్లు ఈ ఏడాది ద్వితీయార్థంలో కొంత వాటాను విక్రయం ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
నిధుల సమీకరణ ఎందుకంటే: బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసిన కోవిడ్-19, మారిటోరియం విధింపు వాస్తవ ప్రభావాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి తెలుస్తాయి. అందువల్ల ఏమైనా అనుకోని ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు సిద్ధంగా తగిన మూలధన నిధులను సమీకరించడం చాలా ముఖ్యమని బ్యాకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే 2008 సంక్షోభం సమయంలో విదేశీ బ్యాంకులు ఎదుర్కోన్న అనుభవాల నుంచి దేశీయ బ్యాంకింగ్ ఎంతో నేర్చుకుంది. సంక్షోభ సమయంలో మూలధన సేకరణను ఆలస్యం చేసిన బ్యాంకులు ఎక్కువగా నష్టపోయిన సంగతిని ఈ సందర్భంగా బ్యాంకింగ్ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఇందుకే ప్రిఫరెన్షియల్ ఇష్యూ: ప్రస్తుత పరిస్థితుల్లో అందరు ఇన్వెస్టర్లు వాటా కొనుగోళ్లకు ఆసక్తి చూపే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఆయా బ్యాంకులు నిధుల సమీకరణకు ప్రిఫరెన్షియల్ ఇష్యూను ఎంచుకున్నాయి. ప్రిఫరెన్షియల్ కేటాయింపు ఇష్యూ పద్దతిలో అతితక్కువ కాలంలో, తక్కువ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించి నిధులను సమీకరించే వీలు ఉంటుంది అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.