పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చే ముందు జాగ్రత్త

10 Dec, 2019 05:24 IST|Sakshi

ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ సూచన

న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్లతో ఇన్వెస్టర్లు పవర్‌ ఆఫ్‌ అటార్నీ (పీవోఏ) ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్‌ఎస్‌ఈ హెచ్చరించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రూ.2,300 కోట్ల విలువైన తమ క్లయింట్ల సెక్యూరిటీలను తన ఖాతాలోకి మళ్లించి, వాటిపై రుణాలు పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కార్వీ క్లయింట్ల పీవోఏను దుర్వినియోగం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ సోమవారం ఓ ప్రకటనలో సూచనలు చేసింది.

► ఇన్వెస్టర్లు తమ తరఫున బ్రోకర్లు నిర్వహించాల్సిన హక్కుల ను పీవోఏలో స్పష్టంగా పేర్కొనాలి. అవి ఎప్పటి వరకు చెల్లుబాటయ్యేది కూడా ఒప్పందంలో ఉండేలా చూసుకోవాలి.  
► పీవోఏకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లో సెక్యూరిటీలను డెలివరీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి. సెబీ, స్టాక్‌ ఎక్సే్ఛ ంజ్‌ నిబంధనల ప్రకారం పీవోఏ అన్నది తప్పనిసరేమీ కాదు.  
► ట్రేడ్‌ కాంట్రాక్టు 24 గంటల్లోపు ఇన్వెస్టర్లకు అందాలి. అదే విధంగా అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతి మూడు నెలలకూ ఓ సారి తప్పకుండా వచ్చేలా చూసుకోవాలి.
► బ్రోకర్‌ వద్ద మార్జిన్‌ కోసం ఉంచిన సెక్యూరిటీలను తనఖా పెట్టి నిధులు పొందేందుకు అనుమతించకూడదు.  
► నిధులు, సెక్యూరిటీలను బ్రోకర్‌ వద్దే ఉంచేయకుండా సకాలంలో తెప్పించుకోవాలి.  
► ట్రేడింగ్, డీమ్యాట్‌ ఖాతాల్లోకి క్రమం తప్పకుండా లాగిన్‌ అయి, బ్యాలన్స్‌ను తనిఖీ చేసుకోవాలి. డిపాజిటరీల నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌లు, స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల నుంచి నిధులు, సెక్యూరిటీలకు సంబంధించి వచ్చే ఎస్‌ఎంఎస్‌లను కూడా పరిశీలించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలను గమనిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్రోకర్లకు తెలియజేయాలి.
► స్టాక్‌ బ్రోకర్‌ వద్ద తమ మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీకి సంబంధించి తాజా వివరాలు ఉండేలా చూసుకోవాలని  కూడా ఇన్వెస్టర్లను ఎన్‌ఎన్‌ఈ కోరింది.

మరిన్ని వార్తలు