అతిపెద్ద క్రిప్టో చోరీ : రూ.20 కోట్లు గోవిందా!

13 Apr, 2018 10:41 IST|Sakshi
అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ జరిగింది. టాప్‌ ఎక్స్చేంజ్‌ సంస్థ నుంచి రూ.20 కోట్ల విలువైన 438 బిట్‌కాయిన్లు చోరీకి గురైనట్టు తెలిసింది. ఢిల్లీకి చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌ కాయిన్‌సెక్యుర్‌ దీనిపై ఫిర్యాదు దాఖలు చేసింది. సంస్థ వాలెట్‌ నుంచి ఈ నగదును సీఎస్‌ఓ అమితాబ్‌ సక్సేనా చోరీ చేసినట్టు సైబర్‌ సెల్‌ వద్ద ఈ ఎక్స్చేంజ్‌ ఎఫ్‌ఐఆర్‌  నమోదు చేసింది. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 66, ఐపీసీ సెక్షన్స్‌ కింద ఈ కేసు సైబర్‌సెల్‌ రిజిస్ట్రర్‌ చేసింది. సక్సేనా దేశం విడిచి పారిపోయే సూచనలు ఉన్నాయని, ఆయన పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయాలని ఈ ఎక్స్చేంజ్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది.

అసలేం జరిగింది...?
కాయిన్‌సెక్యుర్‌ అనే ఈ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌కు రెండు లక్షలకు పైగా యూజర్లున్నారు. ఆఫ్‌లైన్‌గా వారు బిట్‌కాయిన్లను కంపెనీ స్టోర్‌ చేస్తోంది. వీటిని స్టోర్‌ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్‌ కీలు అంటే పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకేజీ ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. దీనికి గుర్తించిన కంపెనీ, హ్యాకర్లను గుర్తించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రభావితానికి గురైన వాలెంట్ల డేటా అంతా అప్పటికే చోరీకి గురై, మొత్తం డేటాను హ్యాకర్లు తొలగించేశారు. బిట్‌కాయిన్లను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసేసుకున్నారు.  ఇక కంపెనీ ఏం చేయలేని పరిస్థితుల్లో గురువారం రాత్రి నుంచి ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌ ద్వారా యూజర్లకు తెలపడం ప్రారంభించింది. తమ బిట్‌కాయిన్ల నిధులు బయటికి బహిర్గతమయ్యాయి అని చెప్పడానికి చింతిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ చోరీలో అంతర్గత వ్యక్తుల పాత్ర ఉందని అనుమానిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్‌ కర్లా అన్నారు. ప్రైవేట్‌ కీలను ఆన్‌లైన్‌లో ఎక్స్‌పోర్ట్‌ చేయమని, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ క్రైమ్‌ చేసినట్టు తాము అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ అనుమానాలన్నింటిన్నీ సైబర్‌సెల్‌తో షేర్‌ చేశామని, హ్యాక్‌ సోర్స్‌ను గుర్తించి, బిట్‌కాయిన్లు ఎక్కడ ఉన్నాయో కనుగొంటామని కర్లా చెప్పారు. ఒకవేళ ఈ నిధులను గుర్తించలేకపోతే, కంపెనీనే తన సొంత ప్యాకెట్‌ నుంచి కస్టమర్లకు పరిహారాలు చెల్లిస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు