200కు పైగా కంపెనీలపై బీఎస్‌ఈ వేటు

10 May, 2018 11:31 IST|Sakshi

ముంబై : దేశీయ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బీఎస్‌ఈ భారీగా కంపెనీలపై వేటు వేసింది. 200కి పైగా కంపెనీలను మే 11 నుంచి డీలిస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. డీలిస్ట్‌ చేసిన ఈ కంపెనీలను ఆరు నెలల పాటు తమ షేర్ల ట్రేడింగ్‌ జరుగకుండా రద్దు చేసింది. ఈ కంపెనీలను అక్రమంగా ఫండ్‌ ప్రవాహాలను చేపట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఆగస్టులోనే సెబీ 331 అనుమానిత షెల్‌ కంపెనీలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్‌లను ఆదేశించింది. అటు ప్రభుత్వం సైతం చాలాకాలంగా కార్యకలాపాలు సాగించని 2 లక్షలకు పైగా సంస్థలను డీరిజిస్ట్రర్‌ చేసింది.

ఈ మేరకు రెండు సర్క్యూలర్లను బీఎస్‌ఈ జారీచేసింది. వాటిలో ఒక సర్క్యూలర్‌లో 188 కంపెనీలను ఆరు నెలల పాటు ట్రేడింగ్‌ జరుగకుండా తమ ప్లాట్‌ఫామ్‌పై మే 11 నుంచి డీలిస్ట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. వీటిలో కొన్ని సంస్థలను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి కంపల్సరీ డీలిస్ట్‌ చేస్తున్నట్టు తెలిపింది. మరో 14 సంస్థలను కూడా ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నామని మరో సర్క్యూలర్‌లో పేర్కొంది. కంపల్సరీ డీలిస్టింగ్‌ రెగ్యులేషన్స్‌ కింద డీలిస్ట్‌ అయిన పూర్తి కాలపు డైరెక్టర్లు, ప్రమోటర్లను, గ్రూప్‌ సంస్థను సెక్యురిటీస్‌ మార్కెట్‌ యాక్సస్‌ పొందకుండా పదేళ్ల పాటు రద్దు చేయనుంది.

>
మరిన్ని వార్తలు