ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ : క్రేజీ డీల్స్‌

13 Jul, 2018 11:03 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌

బెంగళూరు : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కౌంటరిచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్‌ షాపింగ్‌ డేస్‌, జూలై 19 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, డ్రస్‌లు, గాడ్జెట్లు వంటి ఇతర ఉత్పత్తులపై బంపర్‌ ఆఫర్లను, బిగ్‌ డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. కాగ, అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ కూడా జూలై 16నే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్‌ సేల్‌ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. 

ఈ సేల్‌ భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇన్‌స్టాంట్‌ 10 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. ఈ సేల్‌ తేదీల్లో ప్రతి ఎనిమిది గంటలకు ఒక్కసారి భారీగా ధరల తగ్గింపు ఉంటుంది. ఈ సేల్‌ ప్రారంభమైన తొలి రెండు గంటలు ‘రష్‌ అవర్‌’ డీల్స్‌ను  ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించబోతుంది. అంటే జూలై 16న సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. అదనంగా నో కాస్ట్‌ ఈఎంఐ స్కీమ్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. 

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు : ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫోన్‌ రూ.42,999కే అందుబాటులో ఉంటుంది. దీనిలోనే ఎక్స్చేంజ్‌పై 3 వేల రూపాయల తగ్గింపు, 8 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 37 వేల రూపాయల వరకు బై-బ్యాక్‌ ఆఫర్‌ గ్యారెంటీ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌కు లభ్యమవుతుంది. ఈ సేల్‌లో శాంసంగ్‌ ఫోన్ల ధరలు 10,900 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. హానర్‌ 9 లైట్‌ కూడా స్పెషల్‌ ఆఫర్‌ కింద అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకున్న కనీసం వెయ్యి రూపాయలు తగ్గింపును యూజర్లు పొందనున్నారు.

ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, యాక్ససరీస్‌ : గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై 37 వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఏసర్‌ ప్రిడేటర్ హిలియోస్‌ 300 ల్యాప్‌టాప్‌ ధర రూ.89,990 నుంచి రూ.63,990కు తగ్గుతుంది. హెడ్‌ఫోన్లు, ఛార్జర్స్‌పై 75 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. 999 రూపాయల కంటే తక్కువకే బ్లూటూత్‌ స్పీకర్స్‌ లభ్యం కానున్నాయి.

టీవీ, అప్లియెన్స్‌ : శాంసంగ్‌ 80సీఎం(32) హెచ్‌డీ టీవీను రూ.16,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఎయిర్‌  కూలర్స్‌, ఫ్యాన్లను రూ.999 నుంచే ఆఫర్‌ చేస్తుంది.

వస్త్రాలు, ఇతర యాక్ససరీస్‌ : ఈ సేల్‌లో టీ-షర్ట్‌లు, షార్ట్‌లపై 50 శాతం తగ్గింపును అందుబాటులో ఉంచుతుంది. రెండు జతల సన్‌ గ్లాసెస్‌ను రూ.999కే అందిస్తుంది. స్నీకర్స్‌, బ్యాగ్స్‌, వాలెట్స్‌, జువెల్లరీ, అబ్బాయిల వస్త్రాలు, ఫుట్‌వేర్‌, కిడ్స్‌ ఫ్యాషన్‌ వంటి వాటిపై సుమారు 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఇలా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండే మెజార్టీ ఉత్పత్తులపై కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. 
 

మరిన్ని వార్తలు