భారత ఐటీ ఇండస్ట్రీ కోసం మరో దేశం..

1 May, 2017 16:32 IST|Sakshi
భారత ఐటీ ఇండస్ట్రీ కోసం మరో దేశం..
ప్రపంచంలోని కొన్ని దేశాలు భారతీయ వీసా హోల్డర్స్ కు షాకిస్తుండగా.. రష్యా బంపర్ అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరమవుతుండటంతో, భారత ఐటీ ఇండస్ట్రీకి రష్యా తలుపులు బార్ల తెరిచే ఉంచుతుందని ఆ దేశ మంత్రి చెప్పారు. గతవారంలో ఇక్కడ పర్యటనకు వచ్చిన రష్యన్ మంత్రి  సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాల్లో రెండింట్లో ఇరుదేశాల మధ్య సహకారం కోసం చూస్తున్నామని తెలిపారు. కేవలం సహకార చర్చలు మాత్రమే కాక, దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తో కూడా రష్యన్ టెలికాం, మాస్ కమ్యూనికేషన్ డిప్యూటీ మంత్రి రషిద్ ఇష్మైలవ్ చర్చలు జరిపారు. రాడికల్ గ్రూప్ లపై పోరాటానికి సైబర్ సెక్యురిటీలో, ఇతర భద్రతా ముప్పుల్లో ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని మంత్రి, దేశీయ అధికారులతో చర్చించారు.
 
దీంతో అమెరికాలో వీసా నిబంధనలతో దెబ్బతింటున్న దేశీయ ఐటీ ఇండస్ట్రీకి రష్యా చేదుడు వాదోడుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అటు అమెరికాతో పాటు పలు దేశాలు తీసుకొస్తున్న వీసా నిబంధనల కఠితనతరంతో భారత టెక్కీలకు కొన్ని దేశాలు ఆహ్వానాలు పలుకుతున్నాయి. తమ దేశంలో టెక్నాలజీ సేవలు అందించేందుకు రావాలంటూ కెనడా లాంటి దేశాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రష్యా సైతం భారత ఐటీకి బార్ల తలుపులు తెరచి ఉంచనున్నట్టు తెలుపుతోంది.  
 
జూన్ 1 నుంచి 3వ తేదీల్లో రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించబోతున్నారు. దీనిలో భారత్ గెస్ట్ కంట్రీ. ఐటీ రంగాల్లో ఇండో-రష్యన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేదిక ఎంతో సహకరించనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  ఈ ఫోరమ్ లో ప్రధాని మోదీతో పాటు నాస్కామ్ కు చెందిన కొందరు అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు.  భారత్ వరల్డ్ క్లాస్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుండగా.. రష్యా కంప్యూటర్ ప్రొగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లో  ఎక్కుగా పురోగతి సాధిస్తోంది.  
 
మరిన్ని వార్తలు