బడ్జెట్‌ ‘హల్వా’ రెడీ..!

22 Jan, 2019 00:35 IST|Sakshi

నోటి తీపితో... 2019 కేంద్ర బడ్జెట్‌ ముద్రణ ఘట్టం ప్రారంభం

నార్త్‌బ్లాక్‌లో సాంప్రదాయక కార్యక్రమం

ఆర్థికశాఖ సహాయమంత్రులు, సీనియర్‌ అధికారులు హాజరు

హాజరుకాలేకపోయిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ

వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాలో గడుపుతున్న నేపథ్యం

ఫిబ్రవరి 1న పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్‌  

న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్‌ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్‌ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్‌ ప్రతాప్‌ శుక్లా, పొన్‌ రాధాకృష్ణన్, ఆర్థికశాఖ ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఫైనాన్స్‌ సెక్రటరీ ఏఎన్‌ ఝా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే, డీఐపీఏఎం కార్యదర్శి ఏ చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ అధికారుల్లో ఉన్నారు.  వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఎన్‌డీఏ ప్రభుత్వం  ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... కేంద్రం ఓట్‌–ఆన్‌–అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–2020) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. 

బయటి ప్రపంచంతో సంబంధాలు కట్‌...
కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు. నార్త్‌ బ్లాక్‌ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్‌ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. 

అంత గోప్యత ఎందుకు?
ఎంతో పకడ్బందీగా తయారయ్యే  బడ్జెట్‌ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను  కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్‌ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్‌ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా  ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్‌ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్‌ కింద ఉండే బడ్జెట్‌ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్‌ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్‌ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్‌ చేస్తారు.  అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో  ‘మాక్‌ డ్రిల్‌’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరినిసమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. 

మరిన్ని వార్తలు