పెరిగిన వ్యాపార విశ్వాసం

11 Dec, 2017 02:30 IST|Sakshi

మూడో త్రైమాసికంలో పుంజుకున్న సీఐఐ సూచీ

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) మెరుగుపడుతుందన్న ఆశాభావం కంపెనీల్లో వ్యక్తమైంది. సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి 59.7గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సూచీ 58.3 పాయింట్లుగానే ఉంది. త్రైమాసిక వారీ సీఐఐ అవుట్‌లుక్‌ సర్వే ఈ వివరాలను వెల్లడించింది.

జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపారాలకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయన్న సంకేతాలతో మొత్తం మీద ఆర్థికరంగంపై అంచనాలు మెరుగుపడ్డాయి. ‘‘ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు క్షేత్రస్థాయిలో చూపించిన ప్రభావంతో ఆర్థిక రంగం స్థిరమైన పునరుద్ధరణ బాటలో ఉన్నట్టు ఈ సర్వే గుర్తించింది. సూక్ష్మ ఆర్థిక అంశాల పరంగా వృద్ధి పెరుగుదల నిలకడగా ఉంటుందన్న అంచనాలే వ్యాపార విశ్వాస సూచీ పుంజుకోవడానికి కారణం’’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు