కంపెనీల ఆదాయంలో 11-12% వృద్ధి

9 Apr, 2014 10:40 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు స్థిరంగా 7-9% ఉంటాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. కాని గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే ఆదాయాల క్షీణత ఆగి స్వల్ప వృద్ధి కనిపిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11-12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న అంచనాతో ఆదాయం, నిర్వహణ లాభాల్లో క్షీణత ఆగి, వృద్ధి నమోదవుతోందని క్రిసిల్   ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ తెలిపారు.

 దీనికితోడు గత 12-18 నెలల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అం తర్జాతీయంగా జీడీపీ, ఎగుమతుల్లో వృద్ధి కనపడటంతో ఈ ఏడాది ఆదాయాలు 12% వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.   కీలకమైన లోహాలు, ఇంధన, బొగ్గు ధరలు తగ్గడంతో కంపెనీల ఎబిట్టా మార్జిన్లు 1% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ, ఫార్మా, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్ యార్న్ రంగాల ఆదాయాలు బాగా పెరగనున్నాయి. అలాగే గత 3 త్రైమాసికాల నుంచి వృద్ధి బాటలోకి వచ్చిన టెలికం, రిటైల్, మీడియా రంగాలు ఇదే విధమైన ధోరణిని కొనసాగిస్తాయని క్రిసిల్ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు