గృహరుణంపై వడ్డీ రాయితీ 2020 మార్చి వరకూ...

1 Jan, 2019 01:35 IST|Sakshi

మరో విడత గడువు పొడిగించాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) పథకం కింద మధ్యాదాయ వర్గాల (ఎంఐజీ) వారికి ఇస్తున్న క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీని (సీఎల్‌ఎస్‌ఎస్‌) 2020 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం కూడా చేసినట్టు చెప్పారు. ఈ పథకం కింద గృహ రుణం తీసుకున్న వారికి రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీని ఇస్తారు. డిసెంబర్‌ 30 నాటికి 3,39,713 మంది లబ్ధిదారులు సీఎల్‌ఎస్‌ఎస్‌ను వినియోగించుకున్నట్టు మంత్రి తెలిపారు.

తొలుత వడ్డీ రాయితీతో కూడిన రుణ పథకాన్ని 2017 డిసెంబర్‌ వరకు ఏడాది కాల పరిమితితో కేంద్రం తీసుకొచ్చింది. నూతన నిర్మాణం, తిరిగి కొనుగోలు చేసే గృహాలపైనా దీన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత దీన్ని 2019 మార్చి వరకు పొడిగించింది. తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. వార్షికంగా రూ.6– 12 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 20 ఏళ్ల కాలానికి సంబంధించి రూ.9 లక్షల రుణం మొత్తంపై 4 శాతాన్ని రాయితీగా పొందొచ్చు. రూ.12– 18 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి వడ్డీ రాయితీ మూడు శాతమే లభిస్తుంది.    

మరిన్ని వార్తలు