టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్‌..

20 Mar, 2020 08:50 IST|Sakshi

బెంగళూర్‌ : కోవిడ్‌-19 ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ ఉద్యోగుల ఆశలపైనా ఈ మహమ్మారి నీళ్లు చల్లింది. కరోనా వైరస్‌ భయాలతో పలు ఐటీ కంపెనీల సేవలు మందగించడంతో స్లోడౌన్‌ను అధిగమించేందుకు ఆయా కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్‌లోనూ కోతలు పెట్టవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల కిందట అమెరికా ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులే ఐటీ రంగంలో పునరావృతమవుతాయనే ఆందోళన నెలకొంది. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు వంటి ప్రోత్సాహకాలన్నీ ఇప్పుడు నిలిచిపోయాయని టెక్‌ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ ఓ వార్తాసంస్థతో వెల్లడించారు. ప్రజలను సురక్షితంగా ఉంచడంపైనా ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

కరోనా ప్రభావంతో భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు క్యాంపస్‌ల నుంచి ట్రైనీలను ఇళ్లకు పంపించివేశాయి. అమెరికా, యూరప్‌ వంటి కీలక మార్కెట్లలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ వృద్ధిని విశ్లేషకులు సవరిస్తున్నారు. ఐటీ పరిశ్రమ రాబడి వృద్ధి రేటు 3 నుంచి 8 శాతం తగ్గవచ్చని కొటాక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది. ఈ ప్రభావం ఉద్యోగలు వేతనాలు, బోనస్‌లు, ఇంక్రిమెంట్‌లపై ఉంటుందని భావిస్తున్నారు. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు ఈ ఏడాది చివరిలో వేతన పెంపును వర్తింపచేయనున్నాయి.

చదవండి : కరోనా భయం: తుమ్మినందుకు చితక్కొట్టారు

మరిన్ని వార్తలు