జియో కొత్త ప్యాకేజీలు

22 Oct, 2019 05:01 IST|Sakshi

రూ. 222 నుంచి రూ. 444 ప్యాక్‌లు

ఇతర నెట్‌వర్క్‌లకు ఐయూసీ చార్జీల సర్దుబాటు

న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధింపుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టెలికం సంస్థ రిలయన్స్‌ జియో సవరించిన కొత్త టారిఫ్‌ ప్యాకేజీలను ప్రకటించింది. చార్జీలను సర్దుబాటు చేసే విధంగా వీటిని ప్రవేశపెట్టింది. ‘రోజుకు 2 జీబీ డేటా ప్యాక్‌ పరిమితి ఉండే మూడు నెలల ప్యాకేజీ ధరను రూ. 448 నుంచి రూ. 444కి తగ్గిస్తున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు 1,000 నిమిషాల కాల్స్‌కు సరిపడా టాక్‌టైమ్‌ (ఐయూసీ మినిట్స్‌) ఇందులో ఉంటుంది.

సాధారణంగా ఈ ఐయూసీ మినిట్స్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే అదనంగా రూ.80 చెల్లించాల్సి వస్తుంది‘ అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, రెండు నెలల ప్లాన్‌ గడువుండే ప్లాన్‌ రేటును రూ. 333కి తగ్గించడంతో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్‌గోయింగ్‌ కాల్స్‌కు సంబంధించి 1,000 నిమిషాలు పొందవచ్చు. మరోవైపు, ఒక నెల గడువుండే ప్లాన్‌ రేటును రూ. 198 నుంచి రూ. 222కి పెంచిన జియో, రూ. 80 విలువ చేసే ఐయూసీ మినిట్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను టెల్కోలు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఇది ప్రస్తుతం నిమిషానికి 6 పైసలుగా ఉంది.

మరిన్ని వార్తలు