ఆ పదం తొలగించాలని సుప్రీం ముందుకు మాల్యా

6 Dec, 2018 21:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన లిక్కర్‌ కింగ్‌, పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా తనను పరారీలో ఉన్నట్టు ఈడీ పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పేరుకు ముందు పరారీ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రుణ బకాయిల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016, మార్చి 2న భారత్‌ను విడిచివెళ్లి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

దర్యాప్తు సంస్థల చార్జ్‌షీట్‌ల ఆధారంగా న్యాయస్ధానం ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించగా,  పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఈడీ నిర్ధారించింది. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ వచ్చే వారం వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణకు రానున్న క్రమంలో తాను గతంలో కర్నాటక హైకోర్టు ముందుంచిన సెటిల్‌మెంట్‌ ప్రతిపాదనకు అంగీకరించాలని బ్యాంకులను కోరారు.

రుణంలో అసలు మొత్తం చెల్లించేందుకు ఇటీవల మాల్యా  సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న రుణాల్లో అత్యధిక మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు మళ్లించామని, యునైటెడ్‌ బ్రూవరీస్‌ వంటి లిక్కర్‌ వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తమ సంస్ధలు అత్యధిక రాబడిని సమకూర్చాయని మాల్యా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు