ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం

6 Jan, 2020 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  అంతర్జాతీయ మార్కెట్లకు తోడు  దేశీయ స్టాక్‌మార్కెట్లు  యుద్ధ భయాలతో గజగజ వణికాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు రెండూ కీలక మద్దుతుస్థాయిల దిగువకు చేరాయి. చివరకు సెన్సెక్స్‌ 788 పాయింట్లు కుదేలవ్వగా, నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయింది. రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ లాంటి దగ్గజాలతో పాటు బ్యాంకింగ్‌ షేర్లు బాగా నష‍్టపోయాయి. దీంతో గత నాలుగేళ్లలోని లేని సింగిల్‌డే నష్టాలను సెన్సెక్స్‌ నమోదు చేయగా, నిఫ్టీ ఆరు నెలలుగా ఇంతటి నష్టాన్ని చవి చూడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ బ్యాంకు కూడా 832 పాయింట్లు కుప్పకూలింది.  బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంతా, జీ, ఎస్‌బీఐ, యస్‌బ్యాంకు, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. లాభపడిన వాటిలో టైటన్‌, టీసీఎస్‌ నిలిచాయి.

కాగా  ఇరాన్‌ ముఖ్య సైనికాధికారి కసేమ్ సోలైమాని హత్య మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను  రాజేసింది. అలాగే 2015 అణు ఒప్పందం ప్రకారం యురేనియం సుసంపన్న పరిమితులకు కట్టుబడి ఉండబోమని ఇరాన్ ప్రభుత్వం యుద్ధ భయాలను పెంచింది. మరోవైపు సొలైమాని హత్యకు ఇరాన్  ప్రతీకారం తీర్చుకుంటే దానికి మించి పెద్ద ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను బలహీనపర్చాయి. దక్షిణ కొరియా కోస్పి 0.8 శాతం, హాంకాంగ్‌ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.7 శాతం,  జపాన్  నిక్కీ 225   2.1 శాతం బలహీనపడింది.

మరిన్ని వార్తలు