జీ వాటాపై బిలియనీర్ల కన్ను?

4 Apr, 2019 20:11 IST|Sakshi
ముకేశ్‌ అంబానీ, సునీల్‌ మిట్టల్‌ (ఫైల్‌ ఫోటో)

జీ ప్రమోటర్‌ వాటా కొనుగోలు రేసులో ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌ - రిపోర్టు

ఈ ఊహాగానాలను  తిరస్కరించిన ఎయిర్‌టెల్‌

సాక్షి,  న్యూఢిల్లీ:  బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్‌టె​ల్‌ ఛైర్మన్‌ సునీల్ మిట్టల్‌  ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ వాటాలపై కన్నేసినట్లు వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. దేశీయ బిలియనీర్లు  ముకేశ్‌ అంబానీ, సునీల్‌ మిట్టల్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ తాజాగా పేర్కొంది. త్వరలోనే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్‌ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్‌ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్‌ చేసింది.

అయితే వాటా కొనుగోలు రేసులో ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌  ఉన్నాయన్న వార్తలపై ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఈ  ఊహాగానాలను ఎయిర్‌టెల్‌ ప్రతినిధి తిరస్కరించారు. జీలో వాటాల కొనుగోలు రేసులో ఎయిర్‌టెల్‌ లేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. 

కాగా ఎస్సెల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర కొంతమేర వాటాను విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన విషయం సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు