బంకుల్లో క్రెడిట్‌ కార్డుపై క్యాష్‌బ్యాక్‌కు చెల్లు...

26 Sep, 2019 11:24 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుంచి నిలిపివేత

డెబిట్, వ్యాలెట్‌లపై కొనసాగింపు

న్యూఢిల్లీ: పెట్రోల్‌ బంకుల్లో ఇక క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై అక్టోబర్‌ 1 నుంచి 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండబోదు. డీమోనిటైజేషన్‌ తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా... ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు (బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌) ఇంధనం కోసం చేసే డిజిటల్‌ చెల్లింపులపై (క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, వ్యాలెట్‌ ద్వారా) 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. దీన్ని తొలగిస్తున్నట్టు ఎస్‌బీఐ తన కార్డుదారులకు సమాచారం ఇచ్చింది. అన్ని రకాల క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను నిలిపివేయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. డెబిట్‌కార్డు, వ్యాలెట్‌ ద్వారా చేసే చెల్లింపులపై ఈ సదుపాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్‌ తర్వాత కార్డు చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)ను కూడా చమురు మార్కెటింగ్‌ సంస్థలే భరించాలని కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు