మెరుగైన రిస్క్‌ టూల్స్‌ను అనుసరించాలి

5 Nov, 2019 04:50 IST|Sakshi

తగినంత లిక్విడిటీ కలిగి ఉండాలి

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) మెరుగైన రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్‌బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్‌బీఐ ఇటీవలే విడుదల చేసింది. నూతన నిబంధనలను 2020 డిసెంబర్‌ నుంచి కచ్చితంగా ఆచరించాలని నిర్దేశించింది. లిక్విడిటీ కవరేజీ రేషియోలో కనీసం 50 శాతం అధిక నాణ్యతతో కూడిన లిక్విడిటీ ఆస్తులను కలిగి ఉండాలని, 2024 డిసెంబర్‌ నాటికి 100%కి దీన్ని తీసుకెళ్లాలని ఆర్‌బీఐ పేర్కొంది.  

పారితోషికంపై కొత్త నిబంధనలు: విదేశీ, ప్రైవేటు, స్మాల్‌ ఫైనాన్స్, పేమెంట్‌ బ్యాంకులు, లోకల్‌ ఏరియా బ్యాంకుల్లో హోల్‌టైమ్‌ డైరెక్టర్లు, సీఈవోలకు చెల్లించే పారితోషికం విషయమై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది. వేరియబుల్‌ పే (పనితీరు ఆధార చెల్లింపులు)ల్లో నగదు పరిమాణం 67 శాతానికి మించరాదని నిర్దేశించింది.  ఉద్యోగులకు సంబంధించి సమగ్ర చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు రూపొందించుకోవాలని, వార్షికంగా వాటిని సమీక్షించాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు