మాల్యా కేసులో మెతగ్గా వ్యవహరించలేదు: ఎస్‌బీఐ

15 Sep, 2018 02:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణ ఎగవేత ఖాతా వ్యవహారంలో మెతగ్గా వ్యవహరించలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌మాల్యా 2016 మార్చి 2న భారత్‌ నుంచి వెళ్లిపోయారు. అయితే, అతన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని 2016 ఫిబ్రవరిలోనే లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ సూచించినప్పటికీ... ఆయన పరారైన నాలుగు రోజుల తర్వాత 13 బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ స్పందిస్తూ... ‘‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సహా రుణ ఎగవేత కేసుల వ్యవహారాల్లో ఎస్‌బీఐ తరఫున, అధికారుల వైపు ఎటువంటి అలక్ష్యం లేదు.

ఎగవేతల మొత్తాన్ని రాబట్టుకునేందుకు చురుకైన, బలమైన చర్యలను బ్యాంకు తీసుకుంటోంది’’ అని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిలు చెల్లించాల్సిన విజయ్‌మాల్యా ఈ విషయంలో పలు కేసులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విజయ్‌ మాల్యా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తన కంపెనీ (కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌) ఆర్థిక పరిస్థితులు తెలిసీ ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులు తనకు అప్పిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల వైపు తప్పిదం ఉన్నా...  తనను రుణాల ఎగవేతలకు పోస్టర్‌బోయ్‌గా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు