స్టాక్ మార్కెట్లో లాభాల మురిపెం ఒక్క రోజుకే పరిమితమైంది. అమెరికా–చైనాల మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండటంతో మంగళవారం స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఆర్థిక, ఇంధన రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ కీలకమైన 34,000, నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి.
ఆద్యంతం ఒడిదుడు కులమయంగా సాగిన ట్రేడింగ్లో చివరకు సెన్సెక్స్ 176 పాయింట్లు పతనమై 33,891 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 10,198 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంధన, లోహ షేర్లు పతనం కాగా, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి.
376 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ లాభా ల్లోకి వచ్చింది. 109 పాయింట్ల లాభంతో 34,176 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కొద్దిసేపే లాభాల్లో ఉండి మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. 267 పాయింట్ల నష్టంతో 33,800 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 376 పాయింట్ల రేంజ్లో కదలాడింది.
నీరసంగా క్యూ2 ఫలితాలు:మిగిలిన చైనా వస్తువులకు సంబంధించి సుంకాల విషయమై అమెరికా వచ్చే నెలలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. దీంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.