80 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ
మార్కెట్కు కోవిడ్-19 కేసుల పెరుగుదల భయాలు
ఫైనాన్స్, బ్యాంకింగ్, అటో, మెటల్ షేర్లలో విక్రయాలు
జాతీయ అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ సోమవారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 34871 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లను కోల్పోయి 10303 పాయింట్లు వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల విక్రయాలతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.50శాతం నష్టంతో 21,276 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఫైనాన్స్, బ్యాంకింగ్, అటో, మెటల్, మీడియా రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు సంఖ్య కోటి దాటడంతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పట్ల ఇన్వెస్టర్లలో సందేహాలు తలెత్తి అమ్మకాలు జరుపుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ 2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం క్షీణిస్తుందని తాజా నివేదికలో తెలపడంతో మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచింది. ఎంఆర్ఎఫ్, భారత్ ఫోర్జ్, జీఎంఆర్ ఇన్ఫ్రాలతో సుమారు 586 కంపెనీలు నేడు తమ మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి.
బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు:
ఇక అంతర్జాతీయంగా మార్కెట్ల విషయానికొస్తే..., బ్యాంకింగ్ రంగ షేర్ల పతనంతో శుక్రవారం యూఎస్ మార్కెట్లు 2.5శాతం నష్టంతో ముగిసాయి. నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ 2శాతం వరకు నష్టాల్లో కదులుతున్నాయి. మన మార్కెట్ ప్రారంభ సమయానికి అత్యధికంగా జపాన్ ఇండెక్స్ 2శాతం నష్టపోయింది. కొరియా, సింగపూర్, థాయ్లాండ్, ఇండొనేసియా, హాంకాంగ్, చైనా, తైవాన్ 1 క్షీణించాయి.
నిఫ్టీ-50లో... ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. సన్ఫార్మా, ఇన్ఫ్రాటెల్, సిప్లా, ఎంఅండ్ఎం, ఐటీసీ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.