ముంబై : మార్కెట్లు భారీగా దూసుకుపోతున్నాయి. మంచి రుతుపవనాల అంచనాలతో దాదాపు అన్ని రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా జంప్ చేసింది. ప్రస్తుతం 414 పాయింట్ల లాభంలో 35,575ను అధిగమించి, 35,593 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ సైతం 118 పాయింట్లు పెరిగి 10,811 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఐటీ, మెటల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. మిడ్క్యాప్స్ కూడా ర్యాలీ కొనసాగిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం జంప్ చేసింది. మెటల్స్ 2 శాతం పెరిగింది.
టాప్ గెయినర్లుగా వేదంతా, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్ లాభాలు పండిస్తున్నాయి. ఇదే సమయంలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, యూపీఎల్ నష్టపోతున్నాయి. రియల్టీ షేర్లలో యూనిటెక్ 12 శాతం దూసుకెళ్లగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, హెచ్డీఐఎల్, శోభా, బ్రిగేడ్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్ 6-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇక మెటల్ కౌంటర్లలో సెయిల్, జిందాల్ స్టీల్, వేదాంతా, హింద్ కాపర్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వెల్స్పన్ కార్ప్, హిందాల్కో 4.3-1.5 శాతం మధ్య పెరిగాయి.
రుతుపవనాలు ముంబైని తాకాయని, గత పది సంవత్సరాలుగా వర్షాలు ముంబైని తాకిని ప్రతీసారి మార్కెట్లకు మంచి బూస్ట్ వస్తుందని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్చెప్పారు. ఈ సమయంలో 1 శాతం నుంచి 1.5 శాతం పెరుగుతుందని తెలిపారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నాలుగేళ్లలో తొలిసారి రెపో రేటును పెంచినప్పటికీ, పాలసీ తటస్థ వైఖరిని కొనసాగించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. గ్లోబల్గా పాజిటివ్ అవుట్లుక్ కూడా మార్కెట్లకు సహకరిస్తోంది.