సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్

20 Apr, 2017 08:04 IST|Sakshi
సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్
న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్టు తెలుస్తోంది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్బ్యాంకు పేటీఎంలో 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,750 కోట్ల రూపాయల నుంచి 9687 కోట్లు రూపాయల వరకు ఉండొచ్చు. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఫిన్టెక్ స్టార్టప్ పేటీఎం, ఈ డీల్ విషయంలో జపాన్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు నెలలుగా జరుగుతున్న ఈ సంప్రదింపుల్లో ప్రస్తుత పేటీఎం ఇన్వెస్టర్ సైఫ్ పార్టనర్స్, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన కొన్ని షేర్లను  సాప్ట్ బ్యాంకు కొనుగోలుచేస్తోంది. అదేవిధంగా కంపెనీల్లోనూ నగదు రూపంలో పెట్టుబడులు పెట్టనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
 
సాఫ్ట్‌బ్యాంకు ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టినట్లయితే 5 బిలియన్‌ డాలర్ల (రూ.32,293కోట్లకు పైగా) విలువ ఉండే పేటీఎం విలువ 7 బిలియన్ల డాలర్ల(రూ.45,216 కోట్లకు)కు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మొబైల్‌ వ్యాలెట్‌, ఈ-కామర్స్‌ సర్వీసుల్లో దూసుకెళ్లున్న పేటీఎం తాజాగా పెట్టుబడులతో పేటీఎం బ్యాంకు సర్వీసుల విస్తరణను మరింత వేగవంతం చేసుకోబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పేటీఎం సాఫ్ట్ బ్యాంక్ సం‍స్థ లావాదేవీల్లో భాగంగా స్నాప్‌డీల్‌ సొంతమైన చెల్లింపులు సంస్థ ఫ్రీచార్జ్‌ కొనుగోలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.  సాఫ్ట్‌బ్యాంకు కంపెనీ ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీలైన ఫ్లిప్‌కార్డు, అమెజాన్‌ ఇండియాలకు పోటీగా భారత మార్కెట్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
మరిన్ని వార్తలు