ఆకస్మికంగా ఆర్బీఐ గవర్నర్ రాజీనామా
రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి
భారీ నష్టాలతో ఆరంభమైన మార్కెట్లు
అంచనాలను మించి బీజేపీకి సీట్లు
దీంతో మధ్యాహ్నం కొనుగోళ్ల జోరు
190 పాయింట్ల లాభంతో 35,150 వద్దకు సెన్సెక్స్
నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 10,549 వద్ద ముగింపు
అనుకోనిది జరగకపోవడమే మార్కెట్. ఈ మాట మంగళవారం స్టాక్ మార్కెట్కు బాగా వర్తిస్తుంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేయడం, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో సహజంగానైతే స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవాలి. కానీ దీనికి భిన్నంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్లపైకి ఎగబాకాయి. భారీ నష్టాలతో ఆరంభమైనా, ఈ నష్టాలన్నింటినీ రికవరీ చేసుకొని స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 35,150 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 10,549 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, పీఎస్యూ బ్యాంక్లు, వినియోగ, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. సోమవారం సెన్సెక్స్ 714 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున పతనమైన విషయం తెలిసిందే.
మధ్నాహ్నం తర్వాత కొనుగోళ్లు...
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో డాలర్తో రూపాయి మారకం నష్టాల్లో ఆరంభమైంది. దీంతో స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్ల భారీ నష్టాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి. మొదట్లోనే ఈ నష్టాలు మరింతగా పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 534 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి స్టాక్సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 247 పాయింట్లు, నిఫ్టీ 79 పాయింట్లు లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఒక విధంగా చూస్తే, ఉర్జిత్ పటేల్ రాజీనామాను, బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నికల ఫలితాలను మార్కెట్ పట్టించుకోలేదనే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లో బీజేపీకి మరీ తక్కువగా కాకుండా, అంచనాలను మించే సీట్లు రావడం సానుకూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మార్కెట్ సోమవారమే డిస్కౌంట్ చేసుకుందని వారు వివరించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సీఈఓ ఎంపికకు సంబంధించిన కీలకమైన సమావేశం రేపు (గురువారం) జరగనుండటంతో యస్బ్యాంక్ షేర్ 7.2 శాతం లాభంతో రూ. 177 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే.