అతడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు: అమృత

29 Dec, 2018 09:06 IST|Sakshi
ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న అమృత

మిర్యాలగూడ అర్బన్‌ : సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన పెరుమాళ్ల ప్రణయ్‌ ఇంటికి వచ్చిన వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్తిక్‌ టెక్స్‌టైల్స్‌ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్‌ ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రణయ్‌ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది.

వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్‌ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అమృత తమ అత్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తరువాత పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు