కత్తితో పొడుచుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
ప్రేమికురాలి ఇంటి ఎదుటే అఘాయిత్యం
హిమాయత్నగర్: మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రియురాలి నుంచి ఫోన్లు, మెసేజ్లు రాకపోవడంతో మనస్తాపసానికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన రెండు రోజుల క్రితం నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ. గుర్నాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
హిమాయత్నగర్లోని దత్తానగర్కు చెందిన సమ్రీనాబేగం స్థానిక బట్టల షోరూంలో సేల్స్గర్ల్గా పనిచేస్తుంది. ఆమె తరచూ అంబర్పేటలోని చెన్నారెడ్డినగర్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అజార్ఖాన్తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. గతంలో ఓసారి సమ్రీనాబేగం ఫోన్ చేయకపోవడంతో అజార్ఖాన్ చేయి కోసుకున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా తాను ఫోన్ చేసినా ప్రియురాలి నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం రాత్రి దత్తానగర్లోని ఇంటి వద్దకు వచ్చిన అజార్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
దీంతో సదరు యువతి అతడితో మాట్లాడనని చెప్పడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో పొత్తికడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అజార్ఖాన్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సమ్రీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.