నర్సింగ్‌ విద్యార్థి బలవన్మరణం 

22 Aug, 2019 13:17 IST|Sakshi
విచారణ చేస్తున్న టూటౌన్‌ పోలీసులు , కావ్య మృతదేహం 

సాక్షి, అనంతపురం : బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం కళ్యాణదుర్గం రోడ్డులోని ఆదర్శ నర్సింగ్‌ కళాశాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... అమరాపురం మండలం శివరాపురం గ్రామానికి చెందిన లింగరాజు కుమార్తె కావ్య (20) ఆదర్శ నర్సింగ్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కడుపు నొప్పిస్తోందని తరగతి గది నుంచి హాస్టల్‌ రూంకు వెళ్లింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.  

చదువులో వెనుకబడటమే కారణమా..? 
టూటౌన్‌ సీఐ జాకీర్‌హుస్సేన్, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలుగుమీడియం చదివిన కావ్య ఒక్కసారిగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో చదువులో వెనుకబడిందని, మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు ఫెయిలైందని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ జాకీర్‌హుస్సేన్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు