క్యాబ్‌ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు..

19 Jul, 2018 19:57 IST|Sakshi

పబ్లిక్‌ టాయ్‌లెట్‌ గోడపై యువతి సెల్‌ నంబర్‌ రాసిన డ్రైవర్‌

పదేపదే ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో షీ టీమ్‌ను ఆశ్రయించిన బాధితురాలు

రెండు వారాల్లో 65 ఫిర్యాదులు

47 కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): క్యాబ్‌ చార్జీ ఎక్కువ ఇవ్వనందుకు ప్రయాణికురాలి సెల్‌నంబర్‌ను పబ్లిక్‌ టాయ్‌లెట్‌ గోడపై రాసి వేధింపులకు కారణమైన డ్రైవర్‌ను సైబరాబాద్‌ షీ బృందాలు అరెస్టు చేశాయి. ఓ మహిళ కోకాపేట్‌ నుంచి మాదాపూర్‌కు క్యాబ్‌ బుక్‌ చేసిన సమయంలో ప్రయాణ చార్జీ రూ.200 చూపించగా డ్రైవర్‌ ఇతర మార్గాల్లో తిప్పి రూ.800 చార్జీ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అందుకు అంగీకరించని ఆమె రూ.200 మాత్రమే ఇచ్చింది. దీనిని మనస్సులో పెట్టుకున్న డ్రైవర్‌ ఆమె సెల్‌ఫోన్‌ నంబర్‌ను పబ్లిక్‌టాయ్‌లెట్‌ గోడపై రాయడంతో బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. దీంతో బాధితురాలు డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతను నేరం అంగీకరించాడు.

కరాటే శిక్షణ కోసం వెళ్లిన తన కుమార్తెకు మాస్టర్‌ అశ్లీల దృశ్యాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వాట్సాప్‌ ద్వారా ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో షీ బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. గత రెండు వారాల్లో 47 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశాయి. సైబరాబాద్‌ షీ టీమ్‌ ఇన్‌చార్జ్‌ అనసూయ ఈవ్‌టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 64 ఫిర్యాదులు అందగా 47 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు