గ్రామీణ బ్యాంక్ కుంభకోణంలో సీబీఐ మరో కేసు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జైపాల్రెడ్డిపై సీబీఐ గురువారం మరో కేసు నమోదు చేసింది. బ్యాంకు కుంభకోణంలో రూ.9 కోట్ల వరకు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. కుంభకోణంలో బ్యాంక్ క్యాషియర్ జైపాల్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. 2011 నుంచి 2018 ఫిబ్రవరి వరకు ఆయన సంపాదించి న ఆస్తులు, భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరించింది.
జైపాల్రెడ్డి, ఆయన భార్య శాలిని పేర్ల మీద రూ.73.38 లక్షల ఆస్తి ఉంది. రాబడి ద్వారా వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఆయనకున్న ఆస్తుల విలువ 144 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. దీంతో ఈ ఆస్తి అక్రమార్జనగా ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ 1988 ప్రకారం రెడ్ విత్ 13 (2), 13 (1) (ఈ) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజ్ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ తెలిపారు.