సామ రంగారెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదు

24 Nov, 2018 10:55 IST|Sakshi

నాంపల్లి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై నాంపల్లి పోలీసు స్టేషన్‌లో చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లక్ష్మారెడ్డి, రాజ్‌ కుమార్‌ 2005లో ‘ధృవతార’ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా భూములు కొనుగోలు చేసి ఇల్లను నిర్మించేవారు. వీరు కొండాపూర్‌లో 2178 గజాల భూమిని కొనుగోలు చేసి భవన నిర్మాణం చేపట్టగా టీడీపీ నేత సామ రంగారెడ్డి అందులో భాగస్వామిగా చేరారు. 2010లో ప్రాజెక్టు సభ్యుడైన రాజ్‌ కుమార్‌ను తొలగించి సామ రంగారెడ్డి భార్య అలివేలును భాగస్వామిగా చేర్చుకున్నారు.

అనంతరం 2015లో లక్ష్మారెడ్డిని కూడా తొలగించి సాయి విక్రమ్‌ రెడ్డి, జగదీష్‌రెడ్డి, అరవింద్‌రెడ్డిలను భాగస్వాములుగా చేర్చుకోవడమేగాకుండా కొండాపూర్‌లో కొనుగోలు చేసిన ఆస్తిని అమ్మేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి తన సంతకాలను ఫోర్జరీ చేసి మోసం చేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ గురువారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   హైదరాబాద్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం రెడ్‌హిల్స్‌లో ఉన్నందున తాము కేసును నమోదు చేసినట్లు నాంపల్లి  ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌
తెలిపారు.   

మరిన్ని వార్తలు