సాక్షి, ముంబై : మహిళా ప్రయాణీకురాలి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు గురువారం సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ మహిళను అభ్యంతరకరంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ రాజేష్ జంగిడ్ను సస్పెండ్ చేసి అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, దోషిగా తేలితే అతడిపై కఠిన చర్యలు చేపడతామని ఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు.
ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను కానిస్టేబుల్ అభ్యంతరకరంగా తాకడంతో మరో మహిళ వారించగా మరో ప్రయాణీకుడు, మరికొందరు అతడికి దేహశుద్ధి చేశారు. మహిళల భద్రతపై తాము రాజీపడబోమని, ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టామని ఆర్పీఎఫ్ ముంబై డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ సచిన్ భలోడే తెలిపారు.