ప్రేమ జంటతో బలవంతంగా..

1 Aug, 2018 10:03 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె తమకు ఇష్టం లేని వివాహం చేసుకుందని యువతి తల్లితండ్రులు ప్రేమ జంటను కిడ్నాప్‌ చేసి దారుణంగా హింసించడంతో పాటు వారితో బలవంతంగా మూత్రం తాగించిన ఘటన అలిరాజ్‌పూర్‌ జిల్లా హర్దాస్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న గిరిజన మహిళ(21), ఆమె భర్త (23)పై గత నెల 25న యువతి కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడగా నిందితుల్లో ఒకరు ఘటన దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో ఉంచడంతో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం గిరిజన కుటుంబానికి చెందిన ప్రేమ జంట తల్లితం‍డ్రులకు ఇష్టం లేకున్నా ఈ ఏడాది మేలో వివాహం చేసుకుని గుజరాత్‌కు వెళ్లారు. గత వారం దంపతులు అలిరాజ్‌పూర్‌ వచ్చి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు జులై 25న తుపాకీ గురిపెట్టి వారిని కిడ్నాప్‌ చేసి దారుణంగా హింసించారు. యువతి జుట్టును కత్తిరించడంతో పాటు వారితో బలవంతంగా మూత్రం తాగించారు.మహిళ తండ్రి, ఇతరులపై ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా, తాము గుజరాత్‌ నుంచి తిరిగివచ్చే ముందు మహిళ కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకొన్నామని, ప్రేమ వివాహం చేసుకున్నందుకు రూ 70,000 చెల్లించడంతో పాటు వారికి రెండు మేకలను కూడా ఇచ్చామని బాధిత దంపతులు పేర్కొన్నారు.అయినా వారు తమపై దారుణానికి ఒడిగట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు