డబ్బు ఎవరిస్తానన్నారు? 

9 Mar, 2019 03:02 IST|Sakshi

ఆ రూ. 50 లక్షలు ఎక్కడివి? 

మిగిలిన డబ్బు ఎక్కడుంచారు?

ఓటుకు కోట్లు కేసులో స్టీఫెన్‌సన్‌ మిత్రుడిని విచారించిన ఈడీ

మాల్కం టేలర్‌పై 3.30 గంటలపాటు ప్రశ్నల వర్షం

పలు వీడియోల పరిశీలన

ఈడీ కార్యాలయం వద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మిత్రుడు మాల్కం టేలర్‌ను శుక్రవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించి వెలుగుచూసిన మరో వీడియో క్లిప్పింగ్‌పై ఈడీ ప్రశ్నలు సాగినట్లు సమాచారం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాల్కం టేలర్‌ను తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరైన మాల్కం టేలర్‌ను అధికారులు దాదాపుగా 3.30 గంటలపాటు విచారించారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఇస్తానన్న రూ. 50 లక్షలు ఎక్కడ నుంచి తెచ్చారు? మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలనుకున్నారు? వాటిని ఎక్కడ పెట్టారు? అని అడినట్లు తెలిసింది. వీడియోలో ‘బాబు’ప్రస్తావనపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. ‘బాబు’డబ్బులు ఎందుకు ఇస్తానన్నారు? అని ఆరా తీసినట్లు సమాచారం. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!)

ఏసీబీ వీడియోలతో కలిపి పరిశీలన... 
రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసే సమయంలో పలుచోట్ల రహస్య కెమెరాలతో ఏసీబీ పోలీసులు చిత్రీకరించిన వీడియోలను, మరోవైపు మాల్కం టేలర్‌ మొబైల్‌ నుంచి బయటకు వచ్చిన వీడియోను ఈడీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ వీడియోను ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించినట్లు సమాచారం. 

ఏపీ పోలీసుల సంచారం.. 
ఈడీ కార్యాలయం వద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే తచ్చాడుతూ కనిపించారు. మాల్కం టేలర్‌ ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే దాకా అక్కడే నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం కనిపించింది. లోపల ఏం జరిగింది? ఏం ప్రశ్నలు వేశారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులకు ఫోన్‌ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ఇవి చదవండి :

దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం

‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!

మరిన్ని వార్తలు