పట్టుబడింది కల్తీ కారమే...

28 May, 2018 10:38 IST|Sakshi
కారాన్ని పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ శోభా మంజరి, ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ పుష్పరాజ్‌ (ఫైల్‌)

97 శాంపిల్స్‌లో 30 నమానాల్లో కల్తీ అని నిర్ధారణ

28 శాంపిల్స్‌లో నాణ్యత లేదని ధ్రువీకరణ

చార్జీషీటు దాఖలు చేసిన ఆహార నియంత్రణ శాఖ

గత ఏడాది కోల్డ్‌స్టోరేజీలో పెద్దఎత్తున పట్టుబడిన కారం

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కారం కేసు అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయన్న సమాచారంతో కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేసిన  వేల బస్తాల కల్తీ కారాన్ని వ్యాపారులు రోడ్ల వెంబడి  విసిరి వేశారు. ఆహార నియంత్రణ, రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి, కోల్డ్‌స్టోరేజీలు, కారం మిల్లులలో తనిఖీ చేస్తే కళ్లు చెదిరే నిజాలు వెలుగు చూశాయి. కోల్డ్‌స్టోరేజిలో పెద్దఎత్తున కల్తీ కారం నిల్వ ఉన్నట్లు గుర్తించి, సీజ్‌ చేశారు. మొత్తం 97 శాంపిల్స్‌ సేకరించారు. అందులో 30 శాంపిల్స్‌ సురక్షితం కాదని, హానికరమైన పదార్థాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 28 శాంపిల్స్‌లో నాణ్యత లేదని రాష్ట్ర పరిశోధన కేంద్రంలో ధ్రువీకరించారు.

అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది కారం మిల్లులు, కోల్డ్‌ స్టోరేజీ యజమానులు శాంపిల్స్‌ను మైసూరులోని కేంద్రీయ పరీక్ష కేంద్రానికి పంపాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. 18 శాంపిల్స్‌ను అక్కడకు పంపగా అందులో సైతం 14 శాంపిల్స్‌లో నాణ్యత లేదని, 4 శాంపిల్స్‌ సరక్షితం కాదని రావడంతో ఆహార నియంత్రణ అధికారులు ఫైనల్‌ చార్జీషీట్‌ దాఖలు చేసినట్లు సమాచారం. కేసును నాన్చడంతో పాటు, తారుమారు చేసేందుకు, ఓ అధికార పార్టీ నేత ఆ««ధ్వర్యంలో లక్షల రూపాయిలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ మం త్రితో పాటు, ఓ అధికార పార్టీనేత అధికారులపై ఒత్తిడి తెచ్చి నామమాత్రపు కేసులతో సరిపెట్టినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

30 మందిపై క్రిమినల్‌ కేసుల నమోదు
కల్తీ కారం కేసుకు సంబంధించి 30 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. 40 కేసులు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో నడుస్తున్నాయి. ఇందులో 18 కేసుల్లో కారం మిల్లులతోపాటు, కోల్డ్‌స్టోరేజీ యజమానులను ఆయన రూ.50 లక్షల జరిమానా విధించారు. మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ సమయంలోనే గత ఏడాది విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో కల్తీ కారం మిల్లులో పల్టుబడింది. వీటికి ఫుడ్‌ సేఫ్టీ, మార్కెట్‌ యార్డు శాఖ ఇచ్చే లైసెన్సులు కూడా లేవని నిర్ధారించారు.

కొలిక్కి వచ్చిన విచారణ  
కల్తీకారం కేసుకు సంబంధించి విచారణ కొలిక్కి వచ్చింది. మొత్తం 30 క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో 40 కేసులు ఉన్నాయి. మైసూర్‌ ల్యాబ్‌కు పంపిన నమానాలు వచ్చాయి. దీంతో  చార్జీషీట్‌ దాఖలు చేశాం.– షేక్‌ గౌస్‌మోద్దీన్, ఆహారనియంత్రణ  అధికారి, గుంటూరు

మరిన్ని వార్తలు