గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

9 Jul, 2020 06:27 IST|Sakshi
చాంద్‌పాషా మృతదేహం

రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని బలవన్మరణం

రాజేంద్రనగర్‌: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఒకరు రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట ప్రాంతానికి చెందిన చాంద్‌పాషా(42) మంచిరేవులలోని గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం విచారణ కేంద్రం వద్దకు వచ్చిన అతను రివాల్వర్‌తో కణతపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అయితే, అతనికి రివాల్వర్‌ ఎలా వచ్చింది.. అనే విషయంలో పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు.

అతని డ్యూటీ అధికారి వద్ద రివాల్వర్‌ తీసుకొని ఆయన ముందే కాల్చుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. అయితే, గ్రేహౌండ్స్‌లోని కొంతమంది కానిస్టేబుళ్లకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో స్థానికంగానే ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులోనే చికిత్స అందిస్తున్నారు. చాంద్‌పాషాకు సైతం ఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ను వివరణ కోరగా.. అలాంటిది ఏమి లేదని, కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు