నవ వరుడు కిడ్నాప్‌

15 Dec, 2018 10:55 IST|Sakshi
శివానందం, పూర్ణిమ వివాహ దృశ్యం (ఫైల్‌

5 బైకులు, ఓ కారులో వచ్చిన 20 మంది ముఠా

భవానిలో ఘటన

చెన్నై,సేలం: ప్రేమించి వివాహం చేసుకున్న గంట వ్యవధిలోనే నవ వరుడిని ముఠా కిడ్నాప్‌ చేసిన సంఘటన ఈరోడ్‌ జిల్లా భవానిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఈరోడ్‌ జిల్లా నసియనూర్‌ సమీపంలోని కందంపాళయానికి చెందిన కుమారస్వామి కుమారుడు శివానందం (23) నసియనూర్‌లోని ఒక ప్లాస్టిక్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో భవాని సమీపంలోని ఒరిచ్చేరి ఇంద్రానగర్‌కు చెందిన మణియన్‌ కుమార్తె పూర్ణిమ (21) కూడా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారి ప్రేమకు పూర్ణిమ కుటుంబీకులు అంగీకరించగా, శివానందం కుటుంబీకులు ఒప్పుకోలేదు.

దీంతో పూర్ణిమ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు భవాని బస్టాండ్‌ సమీపంలోని పచ్చయప్పన్‌ ఆలయంలో శివానందన్‌కు, పూర్ణిమాకు శుక్రవారం వివాహం జరిపించారు. తర్వాత ఇద్దరూ భవానిలో సంగమేశ్వరర్‌ ఆలయానికి వెళ్లారు. స్వామిని దర్శించుకుని భవాని సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయానికి కారులో వెళుతున్నారు. ఒన్‌ వే మార్గంలో కారు వెళుతుండగా భవాని ప్రధాన తపాళా కార్యాలయం సమీపంలో కారును అడ్డుకున్న 20 మందితో కూడిన ముఠా శివానందంను బలవంతగా కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. విషయం తెలిసి పూర్ణిమ బంధువులు దిగ్భ్రాంతి చెందారు. తర్వాత పూర్ణిమ దీనిపై భవాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో ఆలయానికి వెళ్లి వస్తున్న సమయంలో ఐదు బైకులు, కారులో వచ్చిన వారు తన భర్తను కిడ్నాప్‌ చేసి తీసుకు వెళ్లారన్నారు. తాను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, తనను కింద నెట్టి వేశారన్నారు. కిడ్నాప్‌ చేసిన వారిలో తమ సంస్థలో పని చేస్తున్నవారు పలువురు ఉన్నట్టు పూర్ణిమ తెలిపింది. భవానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు