కొడుకు స్నేహితుడితో తల్లి ఎఫైర్‌.. అడ్డుగా ఉన్నాడని..

8 Mar, 2019 20:35 IST|Sakshi

చండీగఢ్‌ : కామమా లేక పిచ్చా తెలియదుగాని 44 ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని.. తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఆ తల్లి, కన్న కొడుకుని హత్య చేసింది. దీంతో పేగు బంధం కన్న.. అక్రమ సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చిన ఆ తల్లి కటకటాలపాలయింది. ఒళ్లుగగుర్లు పుట్టించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం..

హరియాణాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా దేవి (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే ప్రమోద్‌ను కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరాతీశాడు. నిజం తెలిసి మనస్థాపానికి గురైన ప్రమోద్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుడిని ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రమోద్‌ను హత్య చేయాలని మీనా, ప్రదీప్‌లు నిశ్చయించుకున్నారు. 

ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం ప్రమోద్‌ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరినీ ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం తన కొడుకును ఎవరో హత్య చేశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా తల్లి మీనాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఇంటిచుట్టుపక్కల వారిని విచారించగా అసలు బండారం బయటపడింది. తొలుత సౌరభ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా డొంకంతా కదిలింది. దీంతో తల్లి మీనా, స్నేహితుడు ప్రదీప్‌, మరో ఇద్దరిని పోలీసులు ఆరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు