మద్యం మత్తులో కారు నడిపిన హోమియో వైద్యుడు

4 Nov, 2017 11:13 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన వైద్యుడిని, కారును చుట్టుముట్టిన స్థానికులు

రెండు బైక్‌లను ఢీకొట్టడంతో

ముగ్గురికి గాయాలు

చేబ్రోలు: మద్యం మత్తులో హోమియో వైద్యుడు ఒకరు అతివేగంగా కారును నడిపి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.  చేబ్రోలుకు చెందిన హోమియో వైద్యుడు డాక్టర్‌ సూర్యదేవర వాసుదేవరావు శుక్రవారం నారాకోడూరు నుంచి చేబ్రోలుకు కారులో వస్తూ మద్యం మత్తులో స్థానిక మసీదు సెంటర్‌లో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. అయినా ఆపకుండా వెళుతూ ఎస్‌బీఐ వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. అపార్డ్‌కు చెందిన  నూర్‌ మహ్మమద్‌  చేబ్రోలు మసీద్‌లో నమాజ్‌ చేసుకోవడానికి వచ్చి ప్రమాదానికి గురయ్యారు. 

చేబ్రోలుకు చెందిన పసుపులేటి రవితేజ, మరో యువకుడికి గాయాలయ్యాయి.  వీరిని ప్రైవేట్‌ వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి కారణమైన  వైద్యుడిని స్థానికులు పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.  పోలీసులు బ్రీత్‌ ఎన్‌లైజర్‌ ద్వారా పరీక్ష చేయగా 160 పాయింట్లు ఉన్నట్టు గుర్తించారు.  ప్రమాద సంఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు తెలపడం గమనార్హం.

మరిన్ని వార్తలు