స్నేహితుడిని చంపి ఏడు ముక్కలు చేశాడు

7 Apr, 2018 13:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం ఇద్దరి జీవితాలను కకావికలం చేసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఓ వ్యక్తి.. తన ప్రాణ స్నేహితుడిని అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనతో ఢిల్లీ పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ కేసును అధ్యయనం చేసిన ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం దీన్నొక అరుదైన కేసుగా వర్ణిస్తూ.. పలు సదస్సులో చర్చించటంతో జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

పోలీసుల వివరాల ప్రకారం... మాంసం దుకాణంలో పని చేసే ఓ వ్యక్తి.. బార్‌లో పని చేసే వ్యక్తి...  ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే బార్‌లో పని చేసే వ్యక్తి తన స్నేహితుడి భార్యతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి బాగోతం తెలుసుకున్న సదరు వ్యక్తి.. తన భార్యను పుట్టింటికి పంపించి స్నేహితుడిని పార్టీకి పిలిచాడు. మద్యం మత్తులో ఉన్న తన స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. తర్వాత బయటపడేయాలన్న ఆలోచన చేశాడు. అయితే మద్యం మత్తు దిగిన తర్వాత భయంతో నిందితుడు పారిపోయాడు. 

ఇక తన సోదరుడు కనిపించటం లేదంటూ మృతుడి సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటిని సోదాచేసిన పోలీసుల ఇంటి లోపలి పరిస్థితులను చూసి షాక్‌ తిన్నారు. ఫ్రిజ్‌ నుంచి శరీర భాగాలను ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పరిశీలనకు పంపారు. ఆ ఏడు శరీర భాగాలు అదృశ్యమైన వ్యక్తివేనని ఫోరెన్సిక్‌ అధికారులు దృవీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపం, కసి పెంచుకున్న ఆ వ్యక్తి.. మానసిక స్థితి కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. శరీర అవయవాలను నరికిన విధానమే ఆ విషయాన్ని వెల్లడిస్తోందని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు