దొంగలొస్తారు.. జాగ్రత్త !

7 Oct, 2019 10:30 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: దసర పండగ సందర్భంగా చాలా మంది ఊర్లోకి, వివిధ ప్రాంతాలకు టూర్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబ పట్టణ ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. దొంగలు వీధుల గుండ తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి పక్కింటి వారికి మాయ మాటలు చెప్పి తాళం వేసి ఉన్న ఇంటి వారు తమ బంధువులంటూ సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం రాత్రి వేళ దర్జాగా దొంగలు తమ పని కానిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు దసర సెలవులు ఉన్నందున ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు సైతం పండగకు ఇంటికి తాళం వేసి సొంతూర్లకు వెళ్తుంటారు. ఇదే మంచి తరుణం అని భావించిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణ సీఐ మహేష్‌ దొంగల భారి నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ నిఘా ఉంటుందని, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. 

దొంగతనం కేసులో బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీసీపీ రక్షిత కె. మూర్తి  

దొంగతనాల నివారణకు ఇవి పాటించండి

  •       అత్యవసరంగా ఊరెళ్లాల్సి వస్తే పక్కింటి వారికి తెలపాలి. వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
  •      అతి తక్కువ ధరకు దొరికే వైఫై బేస్‌డ్‌ రోబో కెమెరాను అమర్చుకోవాలి. దీని నుంచి మీ ఇంట్లో జరిగే విషయాలు మీ సెల్‌ఫోన్‌కు అలర్ట్‌ రింగ్‌టోన్‌ వస్తుంది. అది వారికి వినిపించదు. వారు దొంగతనం చేస్తుండగానే పట్టుకునే అవకాశం ఉంటుంది. 
  •      మార్కెట్‌లో సైరన్‌ మోగే తాళాలు సైతం అతి తక్కువ ధరలో దొరుకుతాయి. దానిని కదిలించే ప్రయత్నం ఎవరు చేసిన సైరన్‌ మోగుతుంది. దీంతో పక్కవారు అలర్ట్‌ అయ్యే అవకాశం ఉంది.
  •      తాళం వేసినా అది కనిపించకుండా డోర్‌ కర్టెన్‌ కప్పి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
  •      ఇంటి ముందు ఉన్న గేటుకు తాళం వేయకపోవడం మంచిది. బెడ్‌ రూంలో లైట్‌ వేసి ఉంచాలి
  •      నగలు, నగదు బీరువాల్లో దాచిపెట్టక పోవడం మంచిది.
  •      డబ్బులు, ఆభరణాలు బ్యాంకుల్లో భద్రపర్చుకోవడం ఉత్తమమైనది.
  •      అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
  •      అపార్ట్‌మెంట్‌లో అందరు కలిసి వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. అతనిపై నిఘా ఉంచాలి.
  •      తలుపులకు సమీపంలో కిటికీలు ఉండకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే మంచిది. ఇలా ఉంటే కిటికీల గుండా గడియ తీసే అవకాశం ఉంది.
  •      కొత్తగా ఎవరైన అద్దెకు దిగితే వారి పూర్తి వివరాలు సేకరించాలి. 
  •      మహిళలు బయటకు వెళ్లే ముందు విలువైన నగలు ధరించుకోకుండా వెళ్లడం మంచిది. తప్పదనిపిస్తే నగలు కనిపించకుండా చీర కొంగు లేదా చున్ని మెడ చుట్టూ కప్పుకోవాలి.
  •      వీలైనంత తక్కువ నగలు ధరించడం మంచి ది. ఆర్టిఫిషియల్‌ నగలు ధరించుకోవాలి.
  •      గుర్తు తెలియని వ్యక్తులు మన పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు వారిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. వెంటనే 100 ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.
  •      వీలైతే మీ మొబైల్‌ ద్వారా ఫొటో తీసి పోలీసులకు పంపించాలి.

ప్రజల భద్రత కోసమే పోలీస్‌
ప్రజల భద్రత, ప్రజల ఆస్తుల రక్షణకు పోలీస్‌ వ్యవస్థ 24 గంటలు పని చేస్తుంది. నిర్భయంగా సమాచారం ఇవ్వండి రక్షణ కల్పిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో 24 గంటలు నాలుగు బ్లూ కోట్స్‌ టీములు తిరుగుతున్నాయి. ఊళ్లకు వెళ్లే వారు ముందుగానే పోలీస్‌స్టేషన్లో సమాచారం ఇచ్చి పోతే వారి ఇళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. 100 నంబర్‌ బిజీగా ఉంటే మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌ నంబర్‌ 9059949099కు సమాచారం ఇవ్వచ్చు.    
– ఏసీపీ, గౌస్‌బాబ

మరిన్ని వార్తలు