అంతర్రాష్ట దొంగలు అరెస్ట్‌

17 Feb, 2019 09:16 IST|Sakshi
అరెస్ట్‌ అయిన నిందితులు
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌94 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

నాగోలు: చోరీలకు పాల్పడుతున్న అంతరరాష్ట్ర  నిందితులను  ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.32లక్షల విలువైన 94తులాల బంగారు ఆభణాలు, ఓ బైక్, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ ఈ వివరాలు వెల్లడించారు.  ఉత్తరప్రదేశ్‌కు చెందిన భరత్‌భూషన్‌ భన్సల్‌(52), మధ్యప్రదేశ్‌కు చెందిన మత్తుర ప్రతాప్‌ (42) పాత నేరస్తులు. భరత్‌భూషన్‌ ఉత్తరప్రదేశ్‌ పరిసరప్రాంతాల్లో పలు చోరీలుచేశాడు.  అక్కడి ప్రాంత పోలీసులు గుర్తించడంతో 2009నుంచి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో చోరీలకు చేయడం మొదలుపెట్టాడు. అప్పడికే జైల్‌లో పరిచయమైన ప్రసాద్‌తో కలసి సౌత్‌ ఇండియాలో చోరీలు చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో భరత్‌భూషన్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని  ట్రైన్‌ ద్వారా పార్సల్‌ పంపించి నగరానికి వచ్చిన తర్వాత లోకల్‌ నెంబర్‌ను యూపీని ఏపీ సిరీస్‌గా మార్చి కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళాలు వేసియున్న ఇళ్లను లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు.

ఎప్పుడైనా పోలీసులకు పట్టుపడితే తాము మార్వీడీస్‌ అని మార్బుల్స్‌ షాప్‌లో పనిచేస్తున్నామని  చెబుతూ లాడ్జిలో అవాసం చేసుకొని  తప్పించుకునే వారు. కొంతకాలంగా నిందితులు గతేడాదిగా ఎల్‌బీనగర్‌ డీపీ జోన్‌ పరిధిలో హయత్‌నగర్, వనస్థలి పురం, మీర్‌పేట పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. తరచుగా దొంగతనాలు పెరిగిపోవడంతో వీరిపై దృష్టి సారించిన ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు ద్విచక్రవాహనం తిరుగుతున్న వీరిని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐటీసెల్‌ పోలీసులు, రైల్వే పార్కింగ్‌ దగ్గర సీసీ కెమెరాల్లోనూ వీరిని గుర్తించి పోలీసులను 45 రోజుల శ్రమతో ఇద్దర  నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిని విచారంగా భరత్‌భూషన్‌ పై 66కేసులు నమోదయ్యాయని, ప్రసాద్‌పై కూడా అనేక కేసులున్నాయని సీపీ తెలిపారు. భరత్‌భూషన్‌ ఉత్తర ప్రదేశ్‌లో కోటి రూపాయల విలువైన ఇళ్లు ఉందని సీపీ వెళ్లడించారు.  ఈ సందర్భంగా అంతరరాష్ట్ర ముఠాను పట్టుకునన్న పోలీసులను సీపీ అభినందించి నగదు రివార్డు అందజేశారు. అడిషనల్‌ డీసీపీ క్రైం డి.శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్‌.శ్రీధర్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, సీసీఎస్‌ సీఐలు ప్రవీన్‌బాబు, అశోక్‌కుమార్, హయత్‌నగర్‌ డీఐ జితేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు ముదాసీన్‌ అలీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు